లక్కీడ్రా పేరుతో భారీ మోసం..ఇద్దరిపై కేసు నమోదు
నవగీతం, జగిత్యాల/వెల్గటూర్:
అమాయక ప్రజలకు ఆశ చూపి,లక్కీడ్రా పేరుతో అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్న జగిత్యాల జిల్లాకు చెందిన ఇద్దరు వ్యక్తుల పై పోలీసులు కేసు నమోదు చేశారు.ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను గురువారం ధర్మపురి సీఐ ఎలపాటి రామ్ నర్సింహారెడ్డి వెల్గటూర్ పోలీస్ స్టేషన్లో సీసీఎస్ సీఐ ఎం.శ్రీనివాస్ తో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించిన వివరాల ప్రకారం..జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గం ధర్మారం మండలానికి చెందిన కట్ట రమేష్,కళ్లెం నరేందర్ అనే వ్యక్తులు మా అవసరం-మీ అదృష్టం అనే పేరుతో ఎటువంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా లక్కీ డ్రా నిర్వహిస్తూ ప్రజలను నమ్మబలికారు.డ్రాలో గెలిచిన విజేతలకు భారీ బహుమతులు ఇస్తామని ఆశ చూపి,ఒక్కో కూపన్ ధరను రూ.1116గా నిర్ణయించి ప్రజల నుండి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారనే సమాచారం మేరకు పోలీసులు వారిని పట్టుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని తెలిపారు. అనుమతులు లేకుండా ఇలాంటి మోసపూరిత లక్కీ డ్రాలు నిర్వహించి ప్రజల సొమ్మును దోచుకుంటే చట్టరీత్యా కఠిన చర్యలు తప్పవని సీఐ రామ్ నర్సింహారెడ్డి హెచ్చరించారు. ప్రజలు ఇలాంటి మాయమాటల పట్ల అప్రమత్తంగా ఉండాలని,ఎక్కడైనా అనుమానాస్పద కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే పోలీస్ స్టేషన్కు సమాచారం అందించాలని కోరారు.ఈ సమావేశంలో వెల్గటూర్ ఎస్సై పులిచెర్ల ఉదయ్ కుమార్ తోపాటు సిబ్బంది పాల్గొన్నారు