నవగీతం, జగిత్యాల ప్రతినిధి:
జాతీయ మెగా లోక్ అదాలత్ సందర్భంగా రాజీ పడదగిన కేసులను పరస్పర అంగీకారంతో పరిష్కరించుకోవాలని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ సూచించారు. ఈ నెల 28 న జాతీయ మెగా లోక్ అదాలత్ సందర్భంగా ఈ లోక్ అదాలత్లో క్రిమినల్ కంపౌండబుల్ కేసులు, సివిల్ వివాదాలు, ఆస్తి విభజన కేసులు, కుటుంబ పరమైన నిర్వహణ కేసులు, వైవాహిక వివాదాలు, బ్యాంకు రికవరీ కేసులు, విద్యుత్ చౌర్యం కేసులు, చెక్ బౌన్స్ కేసులు, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు, చిన్నచిన్న పెట్టి కేసులు మరియు ఇతర రాజీ పడదగిన కేసులను సులభంగా పరిష్కరించుకునే అవకాశం ఉందని తెలిపారు.రాజీ మార్గమే రాజమార్గమని, జుడిషియల్ శాఖ కల్పించిన ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జిల్లా పోలీస్ అధికారులు, కోర్టు విధులు నిర్వహించే కానిస్టేబుల్లు మరియు ఇతర సిబ్బంది రాజీ పడదగిన కేసులను గుర్తించి, ఇరువర్గాల వారికి కౌన్సెలింగ్ నిర్వహించి రాజీ కుదిరేలా అవగాహన కల్పిస్తారని తెలిపారు.కాబట్టి తమ కేసులను రాజీ ద్వారా పరిష్కరించుకోవాలని భావించే వారు సంబంధిత పోలీస్ అధికారులను సంప్రదించాలని, లోక్ అదాలత్ ద్వారా బాధితులకు త్వరితగతిన న్యాయం అందుతుందని జిల్లా ఎస్పీ పేర్కొన్నారు.