navageetam.com
Newspaper Banner
Date of Publish : 18 March 2026, 2:47 am Digital Edition : NAVAGEETAM DAILY NEWS

విచ్చల విడిగా పార్కింగ్ – రోడ్లపైనే నిలుపుతున్న వాహనాలు

ట్రాఫిక్ తో ప్రజల ఇబ్బందులు -పట్టించుకోని అధికారులు

నవగీతం,జగిత్యాల ప్రతినిధి:

జగిత్యాల జిల్లా మెట్‌పల్లి పట్టణంలో ట్రాఫిక్ సమస్య రోజురోజుకూ తీవ్రమవుతోంది. ముఖ్యంగా విచ్చలవిడిగా పార్కింగ్ చేయడం వల్ల పట్టణంలోని ప్రధాన రహదారులు కుదించుకుపోతున్నాయి. వ్యాపార కేంద్రాలు, మార్కెట్ ప్రాంతాలు, ప్రభుత్వ కార్యాలయాల వద్ద వాహనదారులు నియమాలను పట్టించుకోకుండా రోడ్లపైనే వాహనాలను నిలిపివేస్తున్నారు. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది.రోడ్లపైనే వాహనాలు నిలిపివేయడం వల్ల ఒకే లైన్‌లోనే వాహనాలు వెళ్లాల్సి వస్తోంది. దీంతో ట్రాఫిక్ జామ్‌లు సాధారణంగా మారిపోయాయి. పీక్ అవర్స్‌లో పరిస్థితి మరింత అధ్వాన్నంగా మారి, విద్యార్థులు, ఉద్యోగులు, అత్యవసర సేవలకు వెళ్లే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా అంబులెన్స్‌లు, అగ్నిమాపక వాహనాలు వెళ్లడానికే మార్గం లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది.

పట్టణంలో సరైన పార్కింగ్ సదుపాయాల లేమి కూడా ఈ సమస్యకు ఒక ప్రధాన కారణంగా మారింది. అయితే ఉన్న కొద్ది పార్కింగ్ స్థలాలను కూడా సరైన విధంగా వినియోగించకపోవడం పరిస్థితిని మరింత దిగజారుస్తోంది. ట్రాఫిక్ నియంత్రణలో అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ట్రాఫిక్ పోలీసుల పర్యవేక్షణ కొరవడటంతో నియమాలు అమలు కావడం లేదు. ఎక్కడ పడితే అక్కడ వాహనాలు నిలిపినా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల వాహనదారులు మరింత నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నారు. అప్పుడప్పుడు డ్రైవ్‌లు నిర్వహించినా అవి తాత్కాలికంగానే మిగిలిపోతున్నాయి.

ఈ సమస్యను పరిష్కరించడానికి అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రధాన రహదారులపై నో పార్కింగ్ జోన్లను కఠినంగా అమలు చేయడం, ప్రత్యేక పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేయడం, ట్రాఫిక్ పోలీసుల పర్యవేక్షణను పెంచడం అత్యవసరం. అలాగే ప్రజల్లో ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించడం ద్వారా సమస్యను కొంతవరకు తగ్గించవచ్చు.పట్టణ అభివృద్ధి కోసం ట్రాఫిక్ నియంత్రణ కీలకం. అధికారులు, ప్రజలు కలిసి కృషి చేస్తేనే మెట్‌పల్లి పట్టణంలో ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది.