navageetam.com
Newspaper Banner
Date of Publish : 12 March 2026, 7:07 am Digital Edition : NAVAGEETAM DAILY NEWS

విద్యార్థులకు పెన్నులు, ఎగ్జామ్ ప్యాడ్స్ పంపిణీ

నవగీతం, మెట్ పల్లి టౌన్:

మెట్ పల్లి పట్టణంలో పదవ తరగతి విద్యార్థులకు ప్రోత్సాహం కల్పించే కార్యక్రమం నిర్వహించారు. త్వరలో ప్రారంభం కానున్న పదవ తరగతి వార్షిక పరీక్షలను దృష్టిలో ఉంచుకుని పట్టణంలోని 15వ వార్డులో గల చావిడి వద్ద ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు 15వ వార్డు కౌన్సిలర్ అరిగెల అనూష–రాకేష్, సైనిక్ ఫౌండేషన్ సహకారంతో పెన్నులు, ఎగ్జామ్ ప్యాడ్స్ పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా సైనిక్ ఫౌండేషన్ ఉపాధ్యక్షులు అరిగెల రాకేష్ మాట్లాడుతూ విద్య నేటి సమాజంలో అత్యంత ముఖ్యమైనదని అన్నారు. విద్య వల్ల వ్యక్తికి సమాజంలో గౌరవం లభిస్తుందని చెప్పారు. పరీక్షలు అనేవి కేవలం మార్కులను కొలిచే సాధనాలు మాత్రమే కాకుండా, విద్యార్థుల క్రమశిక్షణ, పట్టుదలను పరీక్షించే సమయమని తెలిపారు.

పరీక్షల సమయంలో విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా ఆత్మవిశ్వాసంతో, ప్రణాళికాబద్ధంగా చదివి మంచి ఫలితాలు సాధించాలని సూచించారు. అలాగే పరీక్షలు జీవితంలో ఒక భాగం మాత్రమే గానీ, జీవితమే పరీక్ష కాదని చెప్పారు. ఫలితాల గురించి ఆందోళన చెందకుండా శ్రమపై దృష్టి పెట్టాలని విద్యార్థులకు సూచించారు.ఈ కార్యక్రమంలో అరిగెల రాకేష్ తో పాటు పాఠశాల యాజమాన్యం, ఇతరులు పాల్గొన్నారు.