navageetam.com
Newspaper Banner
Date of Publish : 01 April 2026, 4:18 pm Digital Edition : NAVAGEETAM DAILY NEWS

కొండగట్టులో చిన్న హనుమాన్ జయంతి వేడుకలు ప్రారంభం

ఆర్జిత సేవలు తాత్కాలిక రద్దు

నవగీతం,కొడిమ్యాల ప్రతినిధి:

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో చిన్న హనుమాన్ జయంతి ఉత్సవాలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల సందర్భంగా భారీగా భక్తులు, దీక్ష స్వాములు తరలివస్తుండడంతో ఆలయ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేపట్టారు.ఆలయ ఈఓ అంజనారెడ్డి విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్న ప్రకారం, ఏప్రిల్ 1 నుంచి 3వ తేదీ వరకు ప్రతి రోజు వేల సంఖ్యలో దీక్ష స్వాములు మాల విరమణ చేసి స్వామివారిని దర్శించుకోనున్నారు. ఈ నేపథ్యంలో భక్తుల సౌకర్యార్థం కేశఖండన, మాల విరమణ, ప్రత్యేక దర్శనం సేవలు మాత్రమే కొనసాగిస్తున్నట్లు తెలిపారు.మిగతా ఆర్జిత సేవలను తాత్కాలికంగా రద్దు చేసినట్లు వెల్లడించారు. ఏప్రిల్ 4 నుంచి అన్ని సేవలు యథావిధిగా పునఃప్రారంభమవుతాయని స్పష్టం చేశారు.ఇదిలా ఉండగా, ఉత్సవాల మొదటి రోజే వేలాది మంది భక్తులు కొండగట్టుకు చేరుకుని భక్తిశ్రద్ధలతో దర్శనాలు చేసుకుంటున్నారు. ఉదయం నుంచే దీక్ష స్వాములు బారులు తీరగా ఆలయ పరిసరాలు భక్తజన సందోహంతో కిటకిటలాడుతున్నాయి. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక పార్కింగ్ సదుపాయాలు కల్పించడంతో పాటు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.