నవగీతం,కొడిమ్యాల ప్రతినిధి:
జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న ఆలయంలో మే 11, 12, 13 తేదీలలో నిర్వహించనున్న పెద్ద జయంతి ఉత్సవాల కోసం విస్తృత ఏర్పాట్లు చేపట్టాలని ఆలయ ఈఓ ఎస్. అంజనారెడ్డి అధికారులకు ఆదేశించారు.సోమవారం ఆలయ పరిసరాలను పరిశీలించిన ఆయన, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సమగ్ర చర్యలు తీసుకోవాలని సూచించారు. ఉత్సవాల సందర్భంగా భారీగా భక్తులు తరలివచ్చే అవకాశమున్నందున తాగునీటి సదుపాయం, క్యూ లైన్ల ఏర్పాటు, మరుగుదొడ్లు, పారిశుధ్య నిర్వహణ, ప్రసాదం పంపిణీ వంటి అంశాల్లో లోటు లేకుండా చూడాలని స్పష్టం చేశారు.వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని భక్తుల కోసం చల్లని పందిళ్లు (షేడ్లు) ఏర్పాటు చేయాలని, తాగునీటి చలివేంద్రాలు పెంచాలని ప్రత్యేకంగా ఆదేశించారు.భక్తుల రద్దీకి అనుగుణంగా ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని సంబంధిత విభాగాల అధికారులకు దిశానిర్దేశం చేశారు.ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ సునీల్, స్థానాచారి కపిందర్, ముఖ్య అర్చకులు లక్ష్మణ్ చారి, ధర్మేందర్ తదితరులు పాల్గొన్నారు.