సౌత్ జోన్ విజేతగా కెపిఎస్ ప్రభంజనం
నవగీతం, కోరుట్ల ప్రతినిధి:
హైదరాబాద్లోని నోవోటెల్ కన్వెన్షన్ సెంటర్లో లీడ్ సంస్థ అత్యంత వైభవంగా నిర్వహించిన ‘లీడ్ శిక్ష’ అవార్డుల ప్రధానోత్సవంలో కోరుట్ల పబ్లిక్ స్కూల్ (కెపిఎస్) అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది. దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 3000 లీడ్ పాఠశాలల పోటీలో కెపిఎస్ అత్యుత్తమ పనితీరును కనబరిచి, సౌత్ జోన్ స్థాయిలో “బెస్ట్ లీడ్ ఇంప్లిమెంటేషన్ స్కూల్” అవార్డును కైవసం చేసుకుంది. లీడ్ సీఈఓ సుమిత్ మెహ్రా, జోనల్ హెడ్ శ్రీకాంత్ మరియు ఏఈఎం ఐశ్వర్యల చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని అందుకున్నట్లు పాఠశాల కరెస్పాండెంట్ గుజ్జెటీ వెంకటేష్ గర్వంగా ప్రకటించారు. పాఠశాల సిబ్బంది అంకితభావం, లీడ్ బోధనా పద్ధతులను సమర్థవంతంగా అమలు చేయడం వల్లే విద్యార్థుల అభ్యాస నైపుణ్యాలలో అత్యంత ప్రభావవంతమైన మార్పులు వచ్చాయని ఆయన కొనియాడారు. టీమ్ వర్క్, ఉపాధ్యాయుల కృషికి దక్కిన ఈ గుర్తింపు పాఠశాల విద్యా ప్రస్థానంలో ఒక గొప్ప మైలురాయి అని, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి ఇది స్ఫూర్తినిస్తుందని పేర్కొంటూ యాజమాన్యం మరియు సిబ్బందికి ఆయన అభినందనలు తెలియజేశారు.