navageetam.com
Newspaper Banner
Date of Publish : 18 April 2026, 10:21 pm Digital Edition : NAVAGEETAM DAILY NEWS

జగిత్యాల సభ బీఆర్ఎస్ బహిరంగ సభనా..? మాజీ మంత్రి జీవన్ రెడ్డి చేరిక సభనా..?

మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు ప్రకటించాలి..

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని విమర్శిస్తే ఊరుకోం..

సభకు అనుమతి ఇవ్వాలని కలెక్టర్ కు ఆదేశాలు ఇచ్చాం..

జగిత్యాలలో మీడియా సమావేశంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్..

నవగీతం, గిత్యాల ప్రతినిధి:

జగిత్యాల జిల్లా కేంద్రంలో ఈనెల 20వ తేదీన నిర్వహిస్తున్న బీఆర్ఎస్ పార్టీ మీటింగ్ జీవన్ రెడ్డి చేరిక సభనా..? బీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభనా..? ప్రకటించాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో మోతే రోడ్ లోని పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నందయ్య, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ,మున్సిపల్ చైర్మన్ సమిండ్ల వాణితో పాటు పలువురు సీనియర్ కాంగ్రెస్ నాయకులతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.    ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలోని 33 జిల్లాల్లో ఎక్కడ బహిరంగ సభలు ఏర్పాటు చేసుకున్న తమకు ఎలాంటి అభ్యంతరం లేదని అన్నారు. ఈనెల 20వ తేదీన జగిత్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించే సభపై మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావులు క్లారిటీ ఇవ్వాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో అడ్డగోలుగా అక్రమ సంపాదన చేసిన డబ్బుతో జగిత్యాల సభకు జన సమీకరణ చేస్తున్నారని మంత్రి లక్ష్మణ్ కుమార్ ఆరోపించారు. కేవలం 12వేల నుండి 15వేల మందితో సభ నిర్వహించుకునే స్థలంలో నియోజకవర్గానికి ఒక ఇన్ చార్జీని నియమించి జన సమీకరణ చేస్తున్నారని మంత్రి అన్నారు. సీనియర్ నాయకులు జీవన్ రెడ్డి పార్టీ వీడడం బాధాకరంగా ఉందని మంత్రి అన్నారు. పార్టీ వీడుతున్న జీవన్ రెడ్డి చేస్తున్న ఆరోపణలను మంత్రి ఖండించారు. బీఆర్ఎస్ పార్టీ గొప్పగా పనిచేసిందని జీవన్ రెడ్డి అంటున్నారని మరి బీఆర్ఎస్ పార్టీ గొప్పగా పని చేస్తే 2023 ఎన్నికల్లో ప్రజలు ఎందుకు ఓట్లు వేయలేదని మంత్రి ప్రశ్నించారు. పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో ఒక ఎంపీ స్థానంలో బీఆర్ఎస్ పార్టీ గెలవలేదని, కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమి సాధించిందని, పంచాయతీ ఎన్నికల్లో మున్సిపల్ ఎన్నికల్లో సైతం అధికార కాంగ్రెస్ పార్టీ మెజార్టీ సీట్లు సాధించిందని మంత్రి వివరించారు. జీవన్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని విమర్శించడం తగదని ఎందుకు రేవంత్ రెడ్డి దిగిపోవాలని మంత్రి ప్రశ్నించారు. రాష్ట్రంలో అర్హులైన పేదలకు రేషన్ కార్డులు ఇచ్చినందుకు..? నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తున్నందుకా..? రాష్ట్రంలోని తెల్ల రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం ఇస్తున్నందుకా..? ఎందుకు రేవంత్ రెడ్డి దిగిపోవాలని జీవన్ రెడ్డి కోరుకుంటున్నారని మంత్రి ప్రశ్నించారు. పదేళ్లపాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఖజానా ఖాళీ చేసి ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి తీసుకువచ్చిందని మంత్రి అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రాజెక్టు నిర్మాణం చేసి కులేశ్వరం ప్రాజెక్టుగా మార్చారని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు. జీవన్ రెడ్డికి రాజ్యసభ పదవి, ప్రభుత్వ సలహాదారు పదవి ఇవ్వనందుకే పార్టీ మారుతున్నారని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు. జగిత్యాల సమావేశంలో అధికార పార్టీ సభ నిర్వహణకు ఆటంకాలు కల్పిస్తున్నారని వార్తల్లో నిజం లేదని మంత్రి తెలిపారు. సభ నిర్వహణకు అనుమతి ఇవ్వాలని తాను స్వయంగా జగిత్యాల జిల్లా కలెక్టర్ కు చెప్పినట్లు మంత్రి తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో సభలు నిర్వహిస్తే కాంగ్రెస్ పార్టీ నాయకులు ముందస్తు అరెస్టులు చేసి తీసుకువెళ్లే వారిని ఇప్పుడు అలాంటి అరెస్టులు కావడంలేదని మంత్రి స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో అధికార పార్టీతో పాటు ప్రతిపక్ష పార్టీ ఉండాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరుకుంటున్నారని మంత్రి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. జీవన్ రెడ్డి నాడు చెల్లని రూపాయిని కేటీఆర్ ఎన్నికల ప్రచార సమయంలో మాట్లాడాలని నాడు కాంగ్రెస్ పార్టీ లో చెల్లని రూపాయి నేడు బీఆర్ఎస్ లో ఎట్లా చెల్లుబాటు అవుతుందని మంత్రి ప్రశ్నించారు. జగిత్యాల జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందని జీవన్ రెడ్డి పార్టీ మార్పుతో పెద్దగా నష్టం జరిగేది ఏమీ లేదని మంత్రి అన్నారు. జిల్లాలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడానికి గ్రామ గ్రామాన తిరిగి జగిత్యాల జిల్లాలో కాంగ్రెస్ పార్టీని తిరుగులేని శక్తిగా మారుస్తామని మంత్రి అన్నారు. కొండగట్టు ఘాట్ రోడ్డు ప్రమాదంలో 60 మంది చనిపోతే పరామర్శించడానికి రాని కెసిఆర్ జగిత్యాల జైత్రయాత్ర పేరుతో జగిత్యాల సభకు రావడం విడ్డూరంగా ఉందని మంత్రి అడ్లూరి అన్నారు. జగిత్యాల జిల్లాలో మిగిలిపోయిన అభివృద్ధి పనులు పూర్తి చేసి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని జిల్లాకు ఆహ్వానించి జగిత్యాల జిల్లా సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తామని మంత్రి లక్ష్మణ్ కుమార్ తెలిపారు.

జగిత్యాల అభివృద్ధి కోసం కాంగ్రెస్ తో కలిసి పనిచేస్తా..

జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్..

ప్రజా ప్రతినిధిగా ఉన్న ప్రతి ఒక్కరు ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించే అభివృద్ధి పనుల్లో భాగస్వామ్యం కావాలని కోరుకుంటారని అందరు ప్రజాప్రతినిధులు లాగా తాను కూడా జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధి కొనసాగాలని కోరుకుంటున్నాను అని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి తో పాటు మంత్రివర్గ సహచరులు తనతో ఆప్యాయంగా మాట్లాడుతారని అందుకే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంతో కలిసి పని చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు. జీవన్ రెడ్డి రోడ్లు భవనాల శాఖ మంత్రిగా పనిచేసినప్పటికీ వేనాడు జగిత్యాల లోని రోడ్ల విషయం పట్టించుకోలేదని ఎమ్మెల్యే ఆరోపించారు. జగిత్యాల కరీంనగర్ రోడ్డు విస్తరణ చేపట్టకపోవడంతో ప్రయాణం ప్రమాదకరంగా మారిందని పట్టణంలోని పలు రోడ్ల విస్తరణ మరిచిపోవడంతో ట్రాఫిక్ సమస్యలు ఉండేవని ఎమ్మెల్యే అన్నారు. తాను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత పట్టణంలోని రోడ్లతో పాటు ప్రధాన రహదారులు విస్తరణ పై దృష్టి సారించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. జగిత్యాల నియోజకవర్గం అభివృద్ధికి రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంతో తాను కలిసి పని చేస్తానని ఎమ్మెల్యే వివరించారు.

జీవన్ రెడ్డికి ప్రాధాన్యమిచ్చినా కాంగ్రెస్..

కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నందయ్య..

మాజీ మంత్రి జీవన్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ ప్రాధాన్యమిచ్చిందని జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నందయ్య అన్నారు. 1985 నుండి 2024 వరకు జగిత్యాలలో కాంగ్రెస్ పార్టీ బీఫామ్ కావాలని దరఖాస్తు చేసుకున్న రెండో వ్యక్తి లేడని దీన్నిబట్టి కాంగ్రెస్ పార్టీ జీవన్ రెడ్డికి ఎంత ప్రాధాన్యం ఇచ్చిందో అర్థం చేసుకోవాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్తున్న జీవన్ రెడ్డి తనకు కెసిఆర్ తో అనేక ఏళ్లుగా సంబంధాలు ఉన్నాయని, బీజేపీ ఎంపీ అరవింద్ తో అనేక సంవత్సరాలుగా స్నేహం ఉందని చెప్తున్నారని ఈ స్నేహంతోనే 2019లో ఎమ్మెల్సీగా పోటీ చేసిన జీవన్ రెడ్డి పై చంద్రశేఖర్ అనే ఎమ్మెల్సీ అభ్యర్థికి బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ ఇయ్యలేదని ప్రశ్నించారు. జగిత్యాల జిల్లా లో కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టంగా ఉందని నందయ్య తెలిపారు.