రైతులకు పూర్తి సదుపాయాలు: సర్పంచ్ హామీ
నవగీతం ,కొడిమ్యాల ప్రతినిధి:
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నల్లగొండ గ్రామంలో ఐకేపీ కొనుగోలు కేంద్రాన్ని గ్రామ సర్పంచ్ మ్యాకల మాళవిక శ్రీకాంత్, ఉప సర్పంచ్ గంగుల శ్రీనివాస్ రెడ్డి మంగళవారం ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా కొబ్బరికాయ కొట్టి కేంద్రాన్ని ప్రారంభించగా గ్రామస్తులు, రైతులు, కుల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాళవిక శ్రీకాంత్, ఉప సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల కోసం కొనుగోలు వ్యవస్థను సమర్థంగా నిర్వహిస్తున్నదని తెలిపారు. రైతులకు ఎటువంటి ఆటంకాలు లేకుండా అవసరమైన అన్ని సదుపాయాలు కల్పిస్తున్నామని చెప్పారు. అధిక ఉష్ణోగ్రతలను దృష్టిలో ఉంచుకుని తాగునీరు,నీడ వంటి మౌలిక వసతులు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.రైతులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా కొనుగోలు ప్రక్రియను సజావుగా కొనసాగిస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన రైతులు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.