నవగీతం,కొడిమ్యాల ప్రతినిధి:
కొడిమ్యాల మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయం పక్కన ఉన్న నీళ్ల ట్యాంకు నుంచి ప్రతిరోజూ నీరు వృథాగా ట్యాంకు నిండి రహదారిపై పొర్లిపోతు ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తోంది. ఈ సమస్య గతంలో బైరి రాధ సర్పంచ్గా ఉన్న కాలం నుంచే కొనసాగుతోందని స్థానికులు తెలిపారు.అనంతరం బాధ్యతలు చేపట్టిన నూతన సర్పంచ్కు పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిరోజూ రాత్రి 12 గంటల నుంచి 2 గంటల మధ్య ట్యాంకు నిండిపోవడంతో నీరు రోడ్డు పైకి పొంగిపొర్లుతుందని పేర్కొన్నారు.ఈ నీరు రోడ్డు పైకి వచ్చి ఇసుక చేరడంతో ద్విచక్ర వాహనదారులు స్కిడ్ అయి పడిపోతున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి.వృథాగా పారుతున్న ఈ నీటితో సుమారు నాలుగు ఎకరాల పంట సాగు చేయవచ్చని స్థానికులు అంటున్నారు. సమస్యకు పరిష్కారంగా ట్యాంకుకు ఓవర్ఫ్లో పైప్ ఏర్పాటు చేసి, సబ్స్టేషన్ మూలం నుంచి కిరాణా దుకాణం వరకు పైప్లైన్ వేయాలని సూచిస్తున్నారు.అక్కడి నుంచి సబ్స్టేషన్ ఫెన్సింగ్ పక్కన జేసీబీ ద్వారా కాలువ తవ్వి, ఇందూరు పోచమ్మ రోడ్డుకు అనుసంధానం చేస్తే గ్రామపంచాయతీ మురికి కాలువలోకి నీరు మళ్లించవచ్చని తెలిపారు.ప్రస్తుతం వర్క్షాప్ యజమానులు మట్టి పోసి మూసివేసిన మురికి కాలువను తిరిగి తెరిస్తే సమస్య పూర్తిగా పరిష్కారమవుతుందని, నీరు నడిమి కుంటకు చేరుతుందని గ్రామస్థులు పేర్కొన్నారు.
