100శాతం ఉత్తీర్ణతతో విజయభేరి!
నవగీతం,కోరుట్ల ప్రతినిధి:
ఇటీవల విడుదలైన పదవ తరగతి ఫలితాల్లో కోరుట్ల పబ్లిక్ స్కూల్ విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించి తన విద్యా ప్రమాణాల సత్తాను చాటుకుంది. పరీక్షలకు హాజరైన 56 మంది విద్యార్థుల్లో ఏకంగా 37 మంది 500కు పైగా మార్కులు సాధించి రికార్డు సృష్టించగా, గుంటుక రిషిత్, అధే వైష్ణవి 580 మార్కులతో టాపర్లుగా నిలిచి పాఠశాల కీర్తిని దశదిశలా వ్యాపింపజేశారు. ఈ అద్భుత విజయంపై పాఠశాల కరస్పాండెంట్ గుజ్జెటి వెంకటేష్ హర్షం వ్యక్తం చేస్తూ, పదవ తరగతి నుంచే పక్కా ప్రణాళికతో ఐఐటీ ఫౌండేషన్ తరగతులను నిర్వహించడం వల్లే ఈ అసాధారణ ఫలితాలు సాధ్యమయ్యాయని పేర్కొన్నారు. ఈ విజయం విద్యార్థుల కఠోర శ్రమ, ఉపాధ్యాయుల అంకితభావం మరియు తల్లిదండ్రుల సహకారానికి నిదర్శనమని కొనియాడిన ఆయన, భవిష్యత్తులో మరిన్ని మెరుగైన విద్యా ప్రమాణాలతో విద్యార్థులను తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రతిభ చాటిన విద్యార్థులను కరస్పాండెంట్ గుజ్జెటి వెంకటేష్ మరియు అధ్యాపక బృందం ఘనంగా అభినందించారు.