నవగీతం, కొడిమ్యాల ప్రతినిధి:
కొడిమ్యాల మండలం చెప్యాల గ్రామానికి చెందిన లచ్చిరెడ్డి ఇంటి పనుల్లో భాగంగా గ్రైండర్తో గోడ కట్టింగ్ చేస్తుండగా ప్రమాదానికి గురయ్యాడు. పని చేస్తున్న సమయంలో గ్రైండర్ యంత్రం చేతిలో నుంచి జారి కుడి తొడపై పడడంతో తీవ్ర గాయం ఏర్పడింది. దీంతో ఆయన కుడి తొడ భాగంలో లోతైన కోతపడి గాయపడినట్లు తెలిసింది.ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే కొడిమ్యాల మండల ఎలక్ట్రికల్ యూనియన్ కమిటీ సభ్యులు చెప్యాల గ్రామానికి చేరుకుని గాయపడిన లచ్చిరెడ్డిని పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని విచారించి, యూనియన్ సభ్యులు సేకరించిన రూ.5,000లను ఆర్థిక సహాయంగా అందజేశారు.ఈ సందర్భంగా యూనియన్ సభ్యులు బాధితుడు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అలాగే, మరింత సహాయం అందించాలని స్థానికులు, దాతలు ముందుకు రావాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.