మున్సిపల్ కమిషనర్కు మహ్మద్ ముజాహిద్ వినతి
నవగీతం,కోరుట్ల ప్రతినిధి:
కోరుట్ల పట్టణంలోని జగిత్యాల రోడ్డు సమీపంలో ఉన్న వాగు బ్రిడ్జి పక్కన బఫర్ జోన్ భూముల అంశంపై క్షేత్రస్థాయిలో విచారణ జరిపి, వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని సమాజవాది పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి, యునైటెడ్ ముస్లిం మైనారిటీ రైట్స్ ఆర్గనైజేషన్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహ్మద్ ముజాహిద్ కోరారు. ఈ మేరకు సోమవారం ఆయన మున్సిపల్ కమిషనర్కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ముజాహిద్ మాట్లాడుతూ.. సదరు ప్రాంతంలో బఫర్ జోన్ మరియు ఎఫ్టీఎల్ (FTL) హద్దులపై ప్రజల్లో నెలకొన్న సందేహాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. సంబంధిత స్థలాల్లో జరుగుతున్న కార్యకలాపాలపై తక్షణమే గ్రౌండ్ లెవల్ తనిఖీలు నిర్వహించి, హద్దులను స్పష్టంగా నిర్ధారించాలని డిమాండ్ చేశారు.ముఖ్యంగా సామాన్య ప్రజలు అవగాహన లేక ఇబ్బందులు పడకుండా చూడాలని, ఈ విషయంలో మున్సిపల్ యంత్రాంగం అధికారిక ప్రకటన విడుదల చేసి ప్రజలను చైతన్యపరచాలని సూచించారు. అక్రమ నిర్మాణాలు లేదా ఆక్రమణలు ఉంటే చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.