నవగీతం,కొడిమ్యాల ప్రతినిధి:
కొడిమ్యాల మండలం తీర్మాలాపూర్ గ్రామానికి చెందిన ప్రముఖ సామాజిక సేవకుడు, యువతా సంక్షేమ కార్యకర్త వొడ్నాల రాజు వేసవి కాలంలో జరుగుతున్న మండల, జిల్లా స్థాయి క్రీడా టోర్నమెంట్లకు మద్దతుగా ముందుకు వచ్చారు.యువతలో క్రీడలపై ఆసక్తి పెంపొందించేందుకు 22 టీ-షర్ట్లను స్పాన్సర్ చేశారు. ఈ టీ-షర్ట్లు పోటీల్లో పాల్గొనే యువకులకు యూనిఫాం రూపంలో అందించనున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండి క్రీడల వైపు మళ్లాలని ఆకాంక్షించారు. మొబైల్, సోషల్ మీడియా, మద్యం, మత్తు పదార్థాల ప్రభావాల నుంచి దూరంగా ఉండి క్రీడల్లో నిమగ్నం కావడం ద్వారా శారీరక, మానసిక వికాసం సాధ్యమవుతుందని తెలిపారు.క్రీడలు బృంద భావనను పెంచి, క్రమశిక్షణను అలవాటు చేస్తాయని పేర్కొన్నారు.క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, అథ్లెటిక్స్ వంటి విభిన్న క్రీడల్లో యువత ప్రతిభ చాటి, భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరాలని ఆకాంక్షించారు.గతంలోనూ వొడ్నాల రాజు పలు స్పోర్ట్స్ క్యాంపులు, యువతా అవగాహన కార్యక్రమాలు నిర్వహించిన విషయం తెలిసిందే. తాజా స్పాన్సర్షిప్ కూడా యువత అభివృద్ధి కోసం చేస్తున్న కృషిలో భాగమని గ్రామస్తులు తెలిపారు. వేసవి టోర్నమెంట్లలో వందలాది మంది యువకులు పాల్గొననుండగా, తీర్మాలాపూర్ యువతకు ఇది మంచి అవకాశంగా నిలవనుంది.