నవగీతం ,కోరుట్ల ప్రతినిధి :
ఎండలు తీవ్రమవుతున్న నేపథ్యంలో ప్రజలకు విద్యుత్ ఓల్టేజీ సమస్యలు తలెత్తకుండా స్థానిక కౌన్సిలర్ తెడ్డు శ్రీజ విజయ్ ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు. వేసవి తాపానికి ట్రాన్స్ఫార్మర్ల ఎర్తింగ్ వ్యవస్థ డ్రై కాకుండా, విద్యుత్ సరఫరా సాధారణ స్థితిలో ఉండేలా చూసేందుకు ప్రత్యేక చొరవ తీసుకున్నారు.ఇందులో భాగంగా, విద్యుత్ సిబ్బందితో కలిసి ఆయా ప్రాంతాల్లోని ట్రాన్స్ఫార్మర్ల వద్ద వాటర్ ట్యాంకర్ ద్వారా నీరు పట్టించారు. ఎర్తింగ్ పిట్లు తేమగా ఉండటం వల్ల ఓల్టేజీ హెచ్చుతగ్గులు లేకుండా నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా జరుగుతుందని తెలిపారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పర్యవేక్షిస్తున్నట్లు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో విద్యుత్ సరఫరా సిబ్బంది రమేష్, ప్రశాంత్ మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు. కౌన్సిలర్ తీసుకున్న ఈ ముందస్తు చర్య పట్ల వార్డు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.