navageetam.com
Newspaper Banner
Date of Publish : 07 May 2026, 4:52 pm Digital Edition : NAVAGEETAM DAILY NEWS

అనుమానాస్పద వ్యక్తులకు లాడ్జ్ గదులు ఇవ్వొద్దు, గుర్తింపు పత్రాలు తప్పనిసరి

ధర్మపురి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ రామ్ నరసింహారెడ్డి

సీసీ కెమెరాల ఏర్పాటు పై ప్రత్యేక దృష్టి

నవగీతం, జగిత్యాల/ధర్మపురి:

ధర్మపురి పట్టణంలో శాంతి భద్రతల పరిరక్షణ, నేర నియంత్రణ మరియు ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని ధర్మపురి పోలీసు శాఖ ఆధ్వర్యంలో పట్టణ పరిధిలోని లాడ్జ్ యజమానులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ధర్మపురి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ రామ్ నరసింహారెడ్డి హాజరై లాడ్జ్ నిర్వాహకులు తప్పనిసరిగా పాటించవలసిన భద్రత నిబంధనలు మరియు మార్గదర్శకాలపై అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ, లాడ్జ్‌లలో గదులు కేటాయించే ముందు ప్రతి ఒక్కరి నుండి ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడీ లేదా ఇతర చెల్లుబాటు అయ్యే గుర్తింపు పత్రాలు తప్పనిసరిగా సేకరించాలని సూచించారు. వారి పూర్తి వివరాలను రిజిస్టర్‌లో నమోదు చేసి భద్రపరచాలని, అవసరమైన సందర్భాల్లో పోలీసులకు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.అదేవిధంగా, లాడ్జ్ ప్రాంగణం మొత్తం సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా ప్రవేశ ద్వారాలు, రిసెప్షన్, పార్కింగ్ ప్రదేశాలు మరియు కారిడార్లలో నాణ్యమైన సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి, అవి 24 గంటల పాటు నిరంతరం పనిచేసేలా నిర్వహించాలని తెలిపారు. సీసీ ఫుటేజ్ కనీసం కొంతకాలం భద్రపరిచే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.అనుమానాస్పద వ్యక్తులకు లేదా సరైన గుర్తింపు పత్రాలు లేని వారికి గదులు కేటాయించరాదని స్పష్టం చేశారు. ఇలాంటి నిర్లక్ష్యం వలన నేరాలకు అవకాశం ఏర్పడే ప్రమాదం ఉన్నందున లాడ్జ్ యజమానులు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. ఏవైనా అనుమానాస్పద కదలికలు గమనించిన వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.పోలీసు శాఖ జారీ చేసిన మార్గదర్శకాలను ఉల్లంఘించిన లాడ్జ్ యజమానులపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని స్పష్టం చేశారు. పట్టణ భద్రతలో లాడ్జ్ నిర్వాహకుల సహకారం అత్యంత కీలకమని, ప్రజల రక్షణ కోసం పోలీసు శాఖతో సమన్వయంతో పనిచేయాలని సూచించారు.