విద్యార్థుల భద్రతకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కు తల్లిదండ్రుల విజ్ఞప్తి
నవగీతం,కోరుట్ల ప్రతినిధి:
మేడిపల్లి మండలం కల్వకోట గ్రామ జెడ్పీహెచ్ ఎస్,ఎంపీపీఎస్ పాఠశాలలో కోతుల బెడద తీవ్రంగా మారిందని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.గ్రామ సర్పంచ్ గుగ్గిల రమేష్ ఆద్వర్యంలో జిల్లా కలెక్టర్ కు విజ్ఞప్తి చేశారు. పాఠశాల ఆవరణలోకి తరచూ కోతులు చేరుకొని విద్యార్థులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయని తెలిపారు.పాఠశాల సమయాల్లో తరగతి గదుల సమీపంలో కోతులు సంచరిస్తుండటంతో చిన్నారులు భయంతో బయటకు రావడానికి కూడా వెనుకాడుతున్నారని పేర్కొన్నారు. మధ్యాహ్న భోజన సమయంలో విద్యార్థుల చేతుల్లోని ఆహారాన్ని లాక్కోవడం, పాఠశాల సామగ్రిని ధ్వంసం చేయడం వంటి ఘటనలు జరుగుతున్నాయని తెలిపారు.ఇటీవల కోతులు కొంతమంది విద్యార్థులపైకి దూసుకొచ్చిన ఘటనలతో తల్లిదండ్రులు మరింత ఆందోళన చెందుతున్నారు. ఎప్పుడైనా ప్రమాదం జరిగే అవకాశం ఉన్నందున అటవీ శాఖ, విద్యాశాఖ అధికారులు వెంటనే స్పందించి కోతుల బెడద నుండి విద్యార్థులను రక్షించి, కోతులకు అడ్డగా మారిన చెట్ల కొమ్మలను తొలగించి వెంటనే చర్యలు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు. పాఠశాల పరిసరాల్లో భద్రతా చర్యలు పెంచి, కోతులను తరలించే ఏర్పాట్లు చేయాలని తల్లిదండ్రులు జిల్లా కలెక్టర్ కు విజ్ఞప్తి చేశారు.వారి వెంట ఉప సర్పంచ్ అదే రవితేజ,వార్డు సభ్యులు సుమేర అనీష్ మోషిన్,మమతాబాద్ నవీన్, ఎల్ల రాజేష్,గ్రామస్థులు ఉన్నారు.