navageetam.com
Newspaper Banner
Date of Publish : 11 May 2026, 11:07 am Digital Edition : NAVAGEETAM DAILY NEWS

కొండగట్టు గిరి ప్రదక్షిణకు సౌకర్యాలు కల్పిస్తాం

కొండగట్టు అంజన్న ఆలయంలో మంత్రి అడ్లూరి ప్రత్యేక పూజలు

స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి లక్ష్మణ్ కుమార్

నవగీతం,మల్యాల ప్రతినిధి:

కొండగట్టు ఆంజనేయస్వామి గిరి ప్రదక్షిణకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ఒప్పించి అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తామని రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అన్నారు. జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని కొండగట్టు అంజన్న స్వామి ఆలయంలో రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెద్ద హనుమాన్ జయంతిని పురస్కరించుకుని మంత్రి అడ్లూరి అంజన్నను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ పూజారులు మంత్రి కి పుర్ణకుంభ స్వాగతం పలికారు. హనుమాన్ జయంతి సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.ఈసందర్భంగా మంత్రి అడ్లూరి మాట్లాడుతూ కొండగట్టు అంజన్న గిరి ప్రదక్షిణ కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలిసి నిధుల విడుదలకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

గిరి ప్రదక్షిణ భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తామని మంత్రి తెలిపారు. పెద్ద హనుమాన్ జయంతి సందర్భంగా వచ్చే భక్తులకు ఏలాంటి అసౌకర్యాలు కలగకుండా దేవాదాయ శాఖ, పోలీసు శాఖ తరుపున అన్ని ఏర్పాట్లు చేశామని మంత్రి తెలిపారు. భక్తులు సమన్వయం చేసుకొని ప్రశాంతంగా స్వామి వారి దర్శనం చేసుకోవాలి మంత్రి అడ్లూరి సూచించారు. కొండగట్టు అంజన్న ఆశీస్సులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పై, తెలంగాణ రాష్ట్ర ప్రజలపై ఉండాలని ఆకాంక్షించినట్లు మంత్రి అడ్లూరి తెలిపారు. జిల్లా అధికారులు స్థానికంగా ఉండి భక్తులకు ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు.