నవగీతం,కొడిమ్యాల ప్రతినిధి:
జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయస్వామి సన్నిధిలో ఈ నెల 10 నుంచి 13 వరకు జరగనున్న పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తెలిపారు.మంగళవారం జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్తో కలిసి ఎమ్మెల్యే జిల్లా స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్సవాల నిర్వహణలో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని సూచించారు.గత ఉత్సవాల్లో శానిటేషన్, విద్యుత్, చలువ పందిళ్ల ఏర్పాట్లలో లోపాలపై అసంతృప్తి వ్యక్తం చేసిన కలెక్టర్, ఈసారి పకడ్బందీ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయం పరిసరాల్లో తగిన చలువ పందిళ్లు ఏర్పాటు చేయడంతో పాటు, పారిశుద్ధ్యం, తాగునీరు, విద్యుత్ వంటి అన్ని మౌలిక సదుపాయాలను సమృద్ధిగా కల్పించాలని సూచించారు.
