నవగీతం,కొడిమ్యాల ప్రతినిధి:
కొడిమ్యాల పట్టణం అంగడి బజార్లో తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ చేసిన వ్యాఖ్యలపై హిందూ సంఘాలు, యువకులు గురువారం నిరసన కార్యక్రమం నిర్వహించారు.హిందూ మనోభావాలను దెబ్బతీసేలా, హిందూ నినాదాలు దేవుళ్లను కించపరిచే విధంగా మంత్రి మాట్లాడారని నిరసనకారులు ఆరోపించారు. “జై శ్రీరామ్ అంటే పైనుండి డబ్బులు పడుతాయా” అని మంత్రి ఒక కార్యక్రమంలో వ్యాఖ్యానించారని పేర్కొంటూ, ఇది హిందూ సమాజంపై జరిగిన దాడిగా భావిస్తున్నామని తెలిపారు.ఈ సందర్భంగా హిందూ సంఘాల నాయకులు మాట్లాడుతూ, దేవాదాయ శాఖ మంత్రి వెంటనే హిందువులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. హిందూ దేవుళ్లను కించపరిచే వ్యక్తికి దేవాదాయ శాఖ మంత్రిగా కొనసాగేందుకు అర్హత లేదని పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వెంటనే చొరవ తీసుకొని మంత్రి పదవి నుండి తొలగించాలని కోరారు.నిరసన కార్యక్రమంలో హిందూ బందువులు, యువకులు, హిందూ సంఘాల నాయకులు, విశ్వహిందూ పరిషత్ సభ్యులు, ఆరెస్సెస్ సభ్యులు, హనుమాన్ దీక్ష స్వాములు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.