నిత్య సాయి చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ రఘు
నవగీతం, మెట్ పల్లి ప్రతినిధి :
జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన ముగ్గురు చిన్నారులు స్నానం కోసం వెళ్లి కోనేరులో పడి మృతి చెందిన ఘటనపై నిత్యసాయి చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ రఘు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటన గురించి తెలిసిన వెంటనే గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ చిన్నారుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.“ఈ ఘటన నిజంగా హృదయ విదారకమైనది. ఒకేసారి ముగ్గురు చిన్నారులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరం. ఈ వార్త విన్న ప్రతి ఒక్కరూ కలత చెందారని, యావత్ జిల్లా ప్రజలను ఈ ఘటన దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. చిన్నారుల తల్లిదండ్రుల బాధను మాటల్లో వర్ణించలేం. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాని పేర్కొన్నారు. ఈ కష్టకాలంలో వారికి భగవంతుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను” అని డాక్టర్ రఘు పేర్కొన్నారు.ఇటీవల వేసవి సెలవులు కొనసాగుతున్న నేపథ్యంలో చిన్నారులు చెరువులు, కోనేరులు, కాలువలు, బావుల దగ్గరికి వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని, తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆయన సూచించారు. పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరితో కలిసి తిరుగుతున్నారు అనే విషయాలను ఎప్పటికప్పుడు గమనించాలని కోరారు. “చిన్నారులు అమాయకులు. ఆటపాటలలో ప్రమాదాలను గుర్తించలేరు. కాబట్టి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో నీటి వనరుల దగ్గర పిల్లలను ఒంటరిగా పంపించకూడదు. ప్రతి కుటుంబం జాగ్రత్తలు తీసుకుంటే ఇలాంటి విషాద ఘటనలను నివారించవచ్చు” అని డాక్టర్ రఘు అన్నారు.ఈ ఘటన మళ్లీ జరగకుండా గ్రామస్థులు, ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కూడా ఆయన కోరారు.