navageetam.com
Newspaper Banner
Date of Publish : 19 May 2026, 6:15 pm Digital Edition : NAVAGEETAM DAILY NEWS

పారదర్శకమైన ఓటరు జాబితాల తయారీకి రాజకీయ పార్టీల సహకారం అవసరం

జగిత్యాల జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్

నవగీతం, జగిత్యాల ప్రతినిధి :

పారదర్శకమైన, లోపరహిత ఓటరు జాబితాల తయారీ అందరి బాధ్యత అని జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్‌లో అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమం (ఎస్‌ఐఆర్) షెడ్యూల్‌పై సమావేశం నిర్వహించారు. 01.10.2026 అర్హత తేదీని ఆధారంగా చేసుకుని చేపట్టనున్న ప్రత్యేక సవరణ కార్యక్రమానికి సంబంధించిన విధివిధానాలు, షెడ్యూల్, ఎన్నికల సంఘం మార్గదర్శకాలను రాజకీయ పార్టీల ప్రతినిధులకు వివరించారు. జూన్ 15 నుంచి 24 వరకు ఓటరు జాబితా తయారీ, సిబ్బందికి శిక్షణ, ప్రింటింగ్ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అనంతరం జూన్ 25 నుంచి జూలై 24 వరకు బూత్ లెవల్ అధికారులు ఇంటింటి సర్వే చేపట్టి ఓటర్ల వివరాల ధృవీకరణ, కొత్త ఓటర్ల నమోదు, మార్పులు, తొలగింపుల ప్రక్రియలు నిర్వహిస్తారని చెప్పారు.జూలై 31న ముసాయిదా ఓటరు జాబితా ప్రచురించి, జూలై 31 నుంచి ఆగస్టు 30 వరకు క్లెయిమ్స్, అభ్యంతరాలను స్వీకరించనున్నట్లు తెలిపారు. అక్టోబర్ 1న తుది ఓటరు జాబితా ప్రచురణ జరుగుతుందని వెల్లడించారు. ఎన్నికల సంఘం నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం అన్ని కార్యక్రమాలు పారదర్శకంగా నిర్వహించబడతాయని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో నమోదు కావడంతో పాటు అనర్హుల పేర్ల తొలగింపు, వివరాల సవరణపై ప్రజల్లో అవగాహన కల్పించాలని రాజకీయ పార్టీల ప్రతినిధులను కోరారు. సమావేశంలో పాల్గొన్న రాజకీయ పార్టీల ప్రతినిధులు తమ సూచనలు, అభిప్రాయాలను తెలియజేయగా, నిబంధనల ప్రకారం వాటిని పరిశీలిస్తామని కలెక్టర్ తెలిపారు.ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) , ఆర్డీవోలు మధుసూదన్, జీవాకర్ రెడ్డి, నరసింహరావు, తహసీల్దార్లు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.