navageetam.com
Newspaper Banner
Date of Publish : 20 May 2026, 7:18 pm Digital Edition : NAVAGEETAM DAILY NEWS

పారిశుధ్య కార్మికురాలికి పరామర్శ

మున్సిపల్ పాలకవర్గం, ఫ్రెండ్స్ చారిటబుల్ ట్రస్ట్ కొండంత అండ !

నవగీతం, మెట్ పల్లి ప్రతినిధి:

ఇటీవల కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడిన స్థానిక మున్సిపల్ పారిశుధ్య కార్మికురాలు నేరేళ్ల స్వప్నను బుధవారం మెట్‌పల్లి మున్సిపల్ చైర్మన్ మైలారపు లింబాద్రి , వైస్ చైర్మన్ ఓంకార్ నవీన్ మరియు ‘ఫ్రెండ్స్ చారిటబుల్ ట్రస్ట్’ ప్రతినిధులు కలిసి ఆమె నివాసంలో పరామర్శించారు. స్వప్న ఆరోగ్య పరిస్థితిని మరియు అందుతున్న వైద్య సహాయాన్ని వారు స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమెకు అవసరమైన ఆరోగ్య పరీక్షలు చేయించి, మందులను అందజేశారు.అనంతరం మున్సిపల్ చైర్మన్ మరియు వైస్ చైర్మన్ మాట్లాడుతూ.. పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో నిరంతరం శ్రమిస్తున్న పారిశుధ్య కార్మికుల రక్షణకు, సంక్షేమానికి మున్సిపల్ పాలకవర్గం ఎల్లప్పుడూ ప్రథమ ప్రాధాన్యత ఇస్తుందని భరోసా ఇచ్చారు. ప్రమాదవశాత్తూ కుక్కల దాడికి గురై ఇబ్బంది పడుతున్న స్వప్నకు మున్సిపాలిటీ తరపున అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.ఇదే వేదికపై మానవీయ కోణంలో స్పందించిన ‘ఫ్రెండ్స్ చారిటబుల్ ట్రస్ట్’ నిర్వాహకులు.. స్వప్న పూర్తిగా త్వరగా కోలుకోవాలని ఆశిస్తూ, ఆమె తిరిగి విధుల్లో చేరేంత వరకు ప్రతి నెల ఆమె కుటుంబానికి కావలసిన కిరాణా (నిత్యావసర) సరుకులను ఉచితంగా అందజేస్తామని హామీ ఇచ్చారు ఇట్టి కార్యక్రమంలో మున్సిపల్  కౌన్సిలర్స్, ట్రస్ట్ సభ్యులు కార్మిక సంఘం అధ్యక్షుడు లంక శ్రీకాంత్, అంతడుపుల అనిల్ తదితరులు పాల్గొన్నారు.