navageetam.com
Newspaper Banner
Date of Publish : 07 May 2026, 4:12 pm Digital Edition : NAVAGEETAM DAILY NEWS

ప్రజాప్రతినిధులు లేకున్నా మేమున్నాం: విద్యార్థుల ప్రతిభకు ‘యువ’ కిరీటం!

రాజేశ్వరరావుపేట్ యువత ఆదర్శం

పదో తరగతి టాపర్లకు ఘన సన్మానం, నగదు ప్రోత్సాహం

నవగీతం, మెట్‌పల్లి ప్రతినిధి :

రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోయినా.. బాధ్యత గల యువత ఉంటే గ్రామానికి తిరుగులేదని మెట్ పల్లి మండలం లోని రాజేశ్వరరావుపేట్ యువకులు నిరూపించారు. పదో తరగతి ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ప్రోత్సహించడంలో స్థానిక యువత చూపిన చొరవ సర్వత్రా ప్రశంసలందుకుంటోంది.మెట్‌పల్లి మండలంలోని రాజేశ్వరరావుపేట్ గ్రామంలో పదో తరగతిలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు యువత ఆధ్వర్యంలో ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. భూరం రాజేష్ నేతృత్వంలో యువకులు ఎన్నం రమేష్, ఎన్నం శేఖర్, షబ్బీర్, రాహుల్, ప్రకాష్, రాజకుమార్ కలిసి విద్యార్థులను శాలువాలతో సత్కరించి, వారిని అభినందించారు. ఈ సందర్భంగా చెన్నక్క రాజేశం ముందుకు వచ్చి, ప్రతి విద్యార్థికి రూ. 1,000 నగదు ప్రోత్సాహకాన్ని అందించి వారి ఉన్నత చదువులకు వెన్నుదన్నుగా నిలిచారు. సాధారణంగా ఇలాంటి కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు ముందుంటారని, కానీ వారు రాకపోయినా యువతే ఒక బాధ్యతగా స్పందించడం విశేషం. గ్రామంలోని నాయకుల కంటే యువతే గొప్పగా ఆలోచించి విద్యార్థులను ప్రోత్సహించడంపై పాఠశాల ప్రధానోపాధ్యాయులు మచ్చేందర్ అలాగే గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.యువత తలచుకుంటే ఏదైనా సాధ్యమని, విద్యార్థుల విజయాలను గుర్తించి వారిని గౌరవించడం ద్వారా విద్యార్థులలో స్ఫూర్తి నింపారు. రాజేశ్వరరావుపేట్ యువత చూపిన ఈ చొరవ చుట్టుపక్కల గ్రామాలకు కూడా ఆదర్శంగా నిలుస్తోంది.