60 ఏళ్ల వయసులో పంతాలు విడిచి కలిసిన అన్నదమ్ముళ్లు
నవగీతం,రాజన్న సిరిసిల్ల ప్రతినిధి:
రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం కొలనూరు గ్రామానికి చెందిన మామిండ్ల నాగయ్య, మామిండ్ల రాములు చిన్నచిన్న మనస్పర్థల కారణంగా 10 ఏళ్ల క్రితం విడిపోయారు. ఒకే గ్రామంలో ఉంటున్నా, అప్పటి నుంచి ఇద్దరూ మాట్లాడుకోవడం మానేశారు. వీరిద్దరిని మళ్లీ కలిపేందుకు నాగయ్య కుమారుడు శ్రీనివాస్ ఎన్నోసార్లు ప్రయత్నించాడు. కానీ ప్రతిసారి విఫలమయ్యాడు. ఇంతలో నాలుగు రోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో వీరి మేనల్లుడు కూన తిరుపతి మరణించాడు. మూడు రోజుల కార్యానికి అన్నదమ్ముళ్లు ఇద్దరూ హాజరయ్యారు. ఈ సమయంలో శ్రీనివాస్ గత జ్ఞాపకాలను గుర్తుచేస్తూ, వారిలోని ప్రేమను మళ్లీ రేకెత్తించాడు. ఇద్దరూ కంటతడి పెట్టారు.ఆరు పదుల వయసులో, “ఇంకెందుకు పంతాలు?” అనుకొని, ఇకనైనా కలిసి బ్రతుకుదామని నిశ్చయించుకున్నారు. వారు ఆలింగనం చేసుకొని యోగక్షేమాలు అడిగి తెలుసుకుంటూ మళ్లీ ఒక్కటయ్యారు.