navageetam.com
Newspaper Banner
Date of Publish : 24 May 2026, 2:41 pm Digital Edition : NAVAGEETAM DAILY NEWS

మండుతున్న ఎండలు..మనుషులే కాదు, మూగజీవాలూ విలవిల

నవగీతం, భీంగల్ ప్రతినిధి:

రాష్ట్రంలో ఎండల తీవ్రత రోజురోజుకి పేరుగుతోంది. కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 48 నుంచి 50 డిగ్రీల వరకు నమోదవుతుండగా, గాల్లో తేమ శాతం గణనీయంగా తగ్గిపోతోంది. ఫలితంగా మనుషులతో పాటు పక్షులు, మూగజీవాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. మధ్యాహ్నం రోడ్లపైకి అడుగు పెట్టాలంటేనే ప్రజలు భయపడుతున్నారు. మండే ఎండలు, వేడి గాలులతో చిన్నారులు, వృద్ధులు ఎక్కువగా అస్వస్థతకు గురవుతున్నారు. ఆసుపత్రుల్లో వడదెబ్బ కేసులు పెరుగుతున్నాయి. మరోవైపు గ్రామాల్లో, పట్టణాల్లో నీటి కొరత కూడా ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోంది.అయితే ఈ ఎండల ప్రభావం కేవలం మనుషులపైనే కాదు. చెట్లపై కిలకిలమనే పక్షులు ఇప్పుడు నీటి కోసం అల్లాడుతున్నాయి. గ్రామాల్లో, బావులు, చెరువులు ఎండిపోవడంతో పశువులు దాహంతో తిరుగుతున్న దృశ్యాలు చూసిన ప్రతొక్కరి మనసులనూ కలచివేస్తున్నాయి. ఎండ వేడిని తట్టుకోలేక రోడ్ల పక్కన, చెట్ల నీడల్లో మూగజీవాలు సేదతీరే ప్రయత్నం చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మన సామాజిక బాధ్యతను గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనవంతు ప్రయత్నంగా ఇంటి ముందు చిన్న గిన్నెలో నీరు ఉంచితే ఎన్నో పక్షుల ప్రాణాలు నిలుస్తాయి. చెట్లకు నీరు పోయడం, వీలైనంత ఎక్కువగా మొక్కలు నాటడం, దాహంతో తిరిగే జంతువులకు నీరు అందించడం వంటి చిన్న ప్రయత్నాలే పెద్ద మానవీయ సందేశంగా మారతాయి. వైద్య నిపుణులు కూడా ప్రజలు అత్యవసరమైతే తప్ప మధ్యాహ్న సమయంలో బయటకు రావద్దని సూచిస్తున్నారు. ఎక్కువగా నీరు తాగడం, పలుచని దుస్తులు ధరించడం, చిన్నారులు, వృద్ధులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని చెబుతున్నారు..ఇలాంటి అత్యవసర సమయంలో పర్యావరణ పరిరక్షణ, నీటి సంరక్షణ, సామాజిక బాధ్యతపై ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన అవసరం ఉందని పర్యావరణవేత్తలు సూచిస్తున్నారు.“ఒక గిన్నె నీరు… ఒక మూగజీవానికి జీవం” అనే భావనతో ప్రతి ఇంటి ముందూ నీటి పాత్రలు ఏర్పాటు చేస్తే, ఈ మండే వేసవిలో ఎన్నో ప్రాణాలకు ఊరటనివ్వొచ్చు.