ఎమ్మెల్యే డాక్టర్ ఎం. సంజయ్ కుమార్
నవగీతం,జగిత్యాల ప్రతినిధి :
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల యాక్షన్ ప్లాన్ కార్యక్రమంలో భాగంగా జగిత్యాల జిల్లా స్పోర్ట్స్ అండ్ యూత్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన 5కే మారథాన్ను జగిత్యాల ఎమ్మెల్యే ప్రారంభించారు. జగిత్యాల స్వామి వివేకానంద స్టేడియం నుంచి ప్రారంభమైన ఈ మారథాన్లో యువత, క్రీడాకారులు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి రోజు యోగ సాధన, వాకింగ్, వ్యాయామం చేయడం ద్వారా శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత కూడా లభిస్తుందని అన్నారు. “ఆరోగ్యమే మహాభాగ్యం” అని పేర్కొంటూ ప్రతి వ్యక్తి తన దైనందిన జీవితంలో యోగ, వ్యాయామాన్ని భాగం చేసుకోవాలని సూచించారు. నేటి యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి క్రీడలపై దృష్టి సారించాలని ఆయన కోరారు. గ్రామీణ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ముఖ్యమంత్రి నిర్వహిస్తున్న సీఎం కప్ పోటీల ప్రధాన ఉద్దేశం గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన క్రీడాకారులను వెలికితీయడమేనని తెలిపారు. జగిత్యాల నియోజకవర్గంలో క్రీడల అభివృద్ధికి, క్రీడా మైదానాల సదుపాయాల మెరుగుదలకు తనవంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే డాక్టర్ ఎం.సంజయ్ కుమార్ హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ సమైండ్ల వాణి శ్రీనివాస్, కౌన్సిలర్ అరవ లక్ష్మీరాజు, డీవైఎస్ఓ రవి బాబు, నాయకులు, యువత తదితరులు పాల్గొన్నారు.
