navageetam.com
Newspaper Banner
Date of Publish : 02 May 2026, 2:18 pm Digital Edition : NAVAGEETAM DAILY NEWS

రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు

నేల పరీక్ష చేయించాలి – యూరియా వినియోగం తగ్గించాలి

నవగీతం,వేల్పూర్ ప్రతినిధి:

రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమంలో భాగంగా వేల్పూర్ మండల కేంద్రంలోని రామన్నపేట్ గ్రామ పంచాయతీ కార్యాలయం యందు ప్రాంతీయ చెరుకు మరియు వరి పరిశోధన స్థానం రుద్రూర్ శాస్త్రవేత్తలు వ్యవసాయ శాఖ సమన్వయంతో అవగాహనా కార్యక్రమం ను నిర్వహించారు. ఇందులో భాగంగా ఎం. సాయి చరణ్, కీటక శాస్త్రవేత్త మాట్లాడుతూ రైతులందరు తప్పనిసరిగా నేల పరీక్షలు చేయించుకోవాలని, అవసరం మేరకే యూరియా వినియోగించి పంట సాగు ఖర్చు తగ్గించుకోవాలని సూచించారు. యూరియా అధిక వాడకం వల్ల పంటలలో రసం పీల్చే పురుగులు, వరి లో సుడి దోమ, బాక్టీరియా ఎండాకు తెగులు ఉధృతి అధికమవుతుందని తెలిపారు. పొలం లో కాండం తోలుచు పురుగు యొక్క ఉధృతి ఆర్థిక పరిమిత స్థాయిని దాటినప్పుడు మాత్రమే రసాయన మందులు వినియోగించాలని, చీడ పీడల నుండి రక్షించడం కోసం కేవలం రసాయన మందుల్ని విచక్షణారహితంగా పిచికారి చేయకుండా సమగ్ర సస్య రక్షణ చర్యలు పాటించాలని సూచించారు. బి. రాజు, వ్యవసాయ అధికారి, పంట కి సాగు నీరు అవసరం మేరకు అందించాలని, రైతులు సేంద్రియ పద్ధతులను ఉపయోగించి ఆరోగ్యకరమైన దిగుబడులను పొందవచ్చని తెలిపారు. బి. రాజు ఉద్యాన అధికారి, ఆయిల్ పామ్ సాగు అవశ్యకత ను, అధిక రసాయనాల వాడకం ద్వారా కలిగే ఆరోగ్య సమస్యల ను గురించి మరియు ఉద్యాన శాఖ అందిస్తున్న పలు పథకాలను గురించి వివరించారు.ఈ కార్యక్రమంలో ఎస్. వైష్ణవ్, వ్యవసాయ అధికారి, షబ్బీర్ యు. ప్రశాంత్, విస్తరణ అధికారులు  బి. నవీన్- సర్పంచ్, శ్రీనివాస్, శోభన్ రెడ్డి, కోఆపరేటివ్ సొసైటీ మాజీ చైర్మన్ మరియు రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు.