జీలుగ, జనుము సాగుపై రైతులు దృష్టి సారించాలని
నవగీతం, మల్లాపూర్ ప్రతినిధి:
మల్లాపూర్ మండలంలోని ముత్యంపేట గ్రామంలో మంగళవారం నిర్వహించిన ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’ కార్యక్రమం ఉత్సాహభరితంగా జరిగింది. పొలాస వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్తలు మరియు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రైతులకు ఆధునిక సాగు పద్ధతులపై సమగ్ర అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పలువురు శాస్త్రవేత్తలు సేంద్రియ ఎరువుల ప్రాధాన్యత పలు సూచనలు చేశారు.యూరియా వంటి రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించి, నేల సారాన్ని పెంచే పచ్చిరొట్ట ఎరువులైన జీలుగ, జనుము సాగుపై రైతులు దృష్టి సారించాలని సూచించారు.దీని ద్వారా భూమి ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు దీర్ఘకాలిక ప్రయోజనాలు పొందవచ్చని తెలిపారు.శాస్త్రీయ పద్ధతులను అనుసరించడం ద్వారా అనవసర ఖర్చులను తగ్గించి, తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి సాధించవచ్చని వ్యవసాయ శాస్త్రవేత్త డా. జి. వేణుగోపాల్ వివరించారు.కొత్త విత్తన రకాలు, ఆధునిక వ్యవసాయ యంత్రాలపై అవగాహన పెంపొందించుకునేందుకు రైతులు తరచుగా ఆదర్శ పొలాలను సందర్శించాలని మండల వ్యవసాయ విస్తరణ అధికారులు సంధ్య, శ్రీలత సూచించారు.ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్తలు డా. జి.వేణుగోపాల్, వ్యవసాయ ,ఉద్యానవన విస్తరణ అధికారులు సంధ్య, శ్రీలత,ముత్యంపేట గ్రామ సర్పంచ్ తేలు నరేష్ , ఉపసర్పంచ్ వంగ పోతయ్య , ఆత్మ కమిటీ చైర్మన్ వాకిటి భూమారెడ్డి స్థానిక రైతులు పాల్గొన్నారు.సదస్సు ముగింపులో రైతులు తమ సాగు సమస్యలను శాస్త్రవేత్తలతో చర్చించి, సందేహాలను నివృత్తి చేసుకున్నారు.
