navageetam.com
Newspaper Banner
Date of Publish : 05 May 2026, 8:25 pm Digital Edition : NAVAGEETAM DAILY NEWS

రైతు వారోత్సవంలో వ్యవసాయ శాఖ- ఉద్యాన శాఖ రైతు అవగాహన సదస్సు

నవగీతం :వైరా ప్రతినిధి

ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న రైతు వారోత్సవాల సందర్భంగా జిల్లా వ్యాప్తంగా వ్యవసాయ శాఖ -ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో వైరా కృషి విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన రైతు అవగాహన సదస్సు ఘనంగా జరిగింది. రైతులకు ఆధునిక సాగు పద్ధతులు, ప్రత్యామ్నాయ పంటల ప్రాధాన్యం మరియు ఆదాయ వృద్ధి అవకాశాలపై స్పష్టమైన అవగాహన కల్పించేందుకు ఈ సదస్సు ఎంతో ఉపయోగకరంగా నిలిచింది.ఈ సదస్సులో ముఖ్యంగా ఉద్యాన పంటల సాగు విస్తరణ, ఆయిల్ పామ్ సాగు ప్రోత్సాహం, అలాగే వరి, పత్తి, మిరప, మొక్కజొన్న వంటి సాంప్రదాయక పంటలకు ప్రత్యామ్నాయంగా అధిక లాభదాయకమైన పంటలపై రైతులకు మార్గనిర్దేశం చేయబడింది. ఆయిల్ పామ్ సాగు ద్వారా దీర్ఘకాలిక ఆదాయం సాధ్యమవుతుందని, అంతర పంటల ద్వారా అదనపు లాభాలు పొందవచ్చని అధికారులు వివరించారు.వైరా కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యాన శాస్త్రవేత్తలు పావని మరియు ఫణిశ్రీ మాట్లాడుతూ, ఖమ్మం జిల్లాలోని వాతావరణం మరియు నేల పరిస్థితులు ఆయిల్ పామ్ మరియు మల్బరీ సాగుకు అనుకూలంగా ఉన్నాయని తెలిపారు. రైతులు పెద్ద ఎత్తున ఈ పంటలను సాగు చేసి లాభాలను పెంచుకోవాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీలు, సాంకేతిక సహాయం మరియు మార్కెటింగ్ మద్దతును వినియోగించుకోవాలని సూచించారు.ఈ సందర్భంగా మున్సిపల్ వైస్ చైర్మన్ కాపా చంద్రకళ మాట్లాడుతూ, సాంప్రదాయక పంటలపై ఆధారపడటం వల్ల రైతుల ఆదాయం పరిమితమవుతోందని, కాబట్టి ఆయిల్ పామ్, కూరగాయలు, పప్పు దినుసులు, నూనె గింజల పంటల సాగు వైపు రైతులను మళ్లించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ పంటలు మార్కెట్‌లో మంచి డిమాండ్ కలిగి ఉండటంతో పాటు అధిక లాభాలను అందిస్తాయని ఆమె తెలిపారు.వైరా ఉద్యాన అధికారి ఆకుల వేణు మాట్లాడుతూ, ప్రస్తుత పరిస్థితుల్లో నీటి వినియోగ సామర్థ్యాన్ని పెంచుతూ, తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు ఇచ్చే ఉద్యాన పంటలపై రైతులు దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. ఆయిల్ పామ్ వంటి పంటలు ఒకసారి నాటిన తరువాత 30 నుండి 40 సంవత్సరాల వరకు స్థిరమైన దిగుబడిని ఇస్తాయని, ఇది రైతుల ఆర్థిక స్థిరత్వానికి దోహదపడుతుందని వివరించారు. అలాగే ఆధునిక సాగు సాంకేతికతలు, డ్రిప్ సించాయన విధానాలు మరియు సమర్థవంతమైన పంట నిర్వహణ పద్ధతులపై రైతులకు వివరంగా తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఏన్కూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ లచ్చిరామ్ నాయక్, పట్టు పరిశ్రమ డీడీ ముత్యాలు, వ్యవసాయ సహాయ సంచాలకులు తుమ్మలపల్లి కరుణ శ్రీ,వైరా మండల వ్యవసాయ అధికారి మాయన మంజూఖాన్ ,ఏన్కూర్ నరసింహ రావు , సింగరేణి బి అశోక్ గారు ఉద్యాన శాఖ సిబ్బంది, వ్యవసాయ విస్తరణాధికారులు సపవత్ సైదులు, మెడ రాజేష్ వాసంతి, వెంకట నర్సయ్య, కీర్తి, సింగరేణి వ్యవసాయ విస్తరణ అధికారులు ఉద్యాన క్షేత్ర సిబ్బంది, ఆయిల్ పామ్ కంపెనీ ప్రతినిధులు, డ్రిప్ గేషన్ కంపెనీ ప్రతినిధులు వారి సిబ్బంది పాల్గొని రైతులకు అవసరమైన మార్గనిర్దేశం చేశారు.