జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్
నవగీతం,జగిత్యాల ప్రతినిధి :
జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు, ధాన్యం తరలింపు ప్రక్రియతో పాటు జనగణన నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ సోమవారం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లాలో కొనసాగుతున్న ధాన్యం కొనుగోలు ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు.రైతులు విక్రయించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల వద్ద ఎక్కువకాలం నిల్వ లేకుండా వెంటనే రైస్ మిల్లులకు తరలించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ధాన్యం లోడింగ్, అన్లోడింగ్ ప్రక్రియలను నిరంతరం పర్యవేక్షిస్తూ ఎక్కడైనా సమస్యలు తలెత్తితే వెంటనే పరిష్కరించాలని తెలిపారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉంచాలని పేర్కొన్నారు. జిల్లాలోని అన్ని కొనుగోలు కేంద్రాల పనితీరును అధికారులు క్రమం తప్పకుండా పరిశీలించాలని, రవాణా ప్రక్రియలో ఆలస్యం జరగకుండా ట్రాన్స్పోర్టర్లతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. ధాన్యం నిల్వ, తరలింపు అంశాల్లో నిర్లక్ష్యం సహించబోమని హెచ్చరించారు.అనంతరం జనగణన నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. జనగణన ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించేందుకు అవసరమైన సిబ్బంది, శిక్షణ, ఫీల్డ్ స్థాయి ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఖచ్చితమైన సమాచార సేకరణ జరిగేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.ఈ టెలీ కాన్ఫరెన్స్ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) , జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి ఆర్డీవోలు మధుసూదన్, జీవాకర్ రెడ్డి, నరసింహరావు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఎంపీఓలు తదితరులు పాల్గొన్నారు.