navageetam.com
Newspaper Banner
Date of Publish : 13 May 2026, 12:27 pm Digital Edition : NAVAGEETAM DAILY NEWS

విద్యార్థుల భవిష్యత్తుతో రాజకీయాలు చేయొద్దు

చదువుల తల్లి స్థలం కోసం ఎంపీ అరవింద్ ధర్మదీక్ష

జగిత్యాల బీజేపీ నియోజకవర్గ ఇంచార్జీ డాక్టర్ భోగ శ్రావణి

నవగీతం,జగిత్యాల/రాయికల్ :

రాయికల్ పట్టణంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో జగిత్యాల బీజేపీ నియోజకవర్గ ఇంచార్జీ డాక్టర్ భోగ శ్రావణి మాట్లాడుతూ.. విద్యార్థుల భవిష్యత్తు కోసం నిజామాబాద్ ఎంపీ చేపట్టనున్న ధర్మదీక్షకు ప్రజలు, విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద ఎత్తున మద్దతు ఇవ్వాలని కోరారు.చదువుల తల్లి స్థలం కోసం, నవోదయ పాఠశాల మరియు కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్థలం కేటాయించాలని ఆమె డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం విద్యాభివృద్ధి కోసం ముందుకు వచ్చి పాఠశాలలను మంజూరు చేసినప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా స్థలం కేటాయించకుండా జాప్యం చేస్తోందని విమర్శించారు.విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుంటే, రాష్ట్ర ప్రభుత్వం రాజకీయ కుట్రలతో విద్యార్థుల భవిష్యత్తును గాలికి వదిలేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. జగిత్యాల నియోజకవర్గంలో కేంద్రీయ విద్యాలయాన్ని మంజూరు చేపియాల్సిందిగా నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు శ్రీ అరవింద్ ధర్మపురి గారిని అడిగిన వెంటనే వారు పిల్లల భవిష్యత్తు కోసం కేంద్రీయ విద్యాలయాన్ని మంజూరు చేపియడం జరిగింది. కానీ స్థలం కేటాయింపులో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. పక్కనే ఉన్న కోరుట్ల నియోజకవర్గంలో ఇప్పటికే నవోదయ పాఠశాల ప్రారంభమై అడ్మిషన్లు కూడా కొనసాగుతున్నాయని గుర్తు చేశారు. జగిత్యాలలో కూడా సమయానికి స్థలం కేటాయించి ఉంటే ఇప్పటికి పాఠశాల ప్రారంభమై విద్యార్థులకు నాణ్యమైన విద్య అందేదని పేర్కొన్నారు.రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక నాయకుల నిర్లక్ష్యం వల్ల రెండు సంవత్సరాలుగా విద్యార్థులు నష్టపోతున్నారని, వారి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని అన్నారు. విద్యాభివృద్ధిలో కూడా రాజకీయాలు చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. ఈ నెల 15వ తేదీ లోపు రాష్ట్ర ప్రభుత్వం స్థలం కేటాయించాలని గడువు ఇచ్చామని, ఆలోపు చర్యలు తీసుకోకపోతే జగిత్యాల జిల్లా కేంద్రంలోని తహసీల్దార్ చౌరస్తా వద్ద అంబేద్కర్ విగ్రహం ఎదుట ఎంపీ ధర్మపురి అరవింద్ ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేపడతామని హెచ్చరించారు.ఈ ధర్మదీక్షకు బీజేపీ రాష్ట్ర నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ ప్రజాప్రతినిధులు హాజరై విజయవంతం చేయనున్నారని తెలిపారు. జగిత్యాల నియోజకవర్గ ప్రజలు, రాయికల్ పట్టణం మరియు మండల ప్రజలు, విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని డాక్టర్ భోగ శ్రావణి కోరారు.ఈ కార్యక్రమంలో రాయికల్ పట్టణ అధ్యక్షులు కుర్మా మల్లారెడ్డి,రాయికల్ మండల అధ్యక్షులు ఆకుల మహేష్, రాయికల్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కల్లెడ ధర్మపురి, 11వ వార్డ్ కౌన్సిలర్ పుర్రె శ్రీధర్, పాక్స్ చైర్మన్ ముత్యం రెడ్డి, కునారపు భూమేష్, రవీందర్ రెడ్డి, వేముల రాము,తోపారపు సురేష్, పటేల్ రాము,సమల్ల సతీష్,సింగని సతీష్,విజయ్ తదితరులు పాల్గొన్నారు.