16వ వార్డు కౌన్సిలర్ కృతజ్ఞతలు
నవగీతం, కోరుట్ల ప్రతినిధి :
కోరుట్ల పట్టణంలో గురువారం సాయంత్రం ఆకస్మాత్తుగా కురిసిన గాలివాన, ఉరుములు, మెరుపుల బీభత్సానికి 16వ వార్డులో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. భీకరమైన గాలుల ధాటికి విద్యుత్ తీగల్లో సమస్య ఏర్పడి వార్డు ప్రజలకు విద్యుత్ సరఫరా ఆగిపోయి ఇబ్బందులు ఎదుర్కొన్నారు.దీనిపై 16వ వార్డు కౌన్సిలర్ పొట్ట సురేందర్ తక్షణమే స్పందించి, కోరుట్ల విద్యుత్ శాఖ అధికారులకు, సిబ్బందికి సమాచారం అందించారు. వర్షం కురుస్తున్నప్పటికీ, ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఘటనా స్థలానికి చేరుకున్న విద్యుత్ సిబ్బంది, దాదాపు గంటపాటు శ్రమించి విద్యుత్ స్తంభాల వద్ద మరమ్మతులు చేపట్టారు. మొబైల్ ఫ్లాష్ లైట్లు టార్చ్ లైట్ల వెలుగులో, ప్రాణాలకు తెగించి విద్యుత్ లైన్లను పునరుద్ధరించిన తీరుపై వార్డు ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా కౌన్సిలర్ పొట్ట సురేందర్ మాట్లాడుతూ.. ప్రజలందరూ ఇళ్లలో సురక్షితంగా ఉన్న సమయంలో, అకాల వర్షంలో కూడా అంకితభావంతో విధులు నిర్వహిస్తున్న విద్యుత్ సిబ్బంది సేవలు అమోఘం. చీకటిలో వారు చేస్తున్న పోరాటం సామాన్యమైనది కాదు. ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా శ్రమించిన సిబ్బందికి 16వ వార్డు ప్రజల పక్షాన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అని పేర్కొన్నారు.