నవగీతం, జగిత్యాల ప్రతినిధి :
తెలంగాణ రాష్ట్ర వెలమ సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ గా కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి జువ్వాడి నర్సింగరావు నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం బుధవారం నియా మకపు ఉత్తర్వులు జారీ చేసింది. జువ్వాడి నర్సింగారావు చాలా కాలంగా రాజకీయాల్లో చురుకుగా కొనసాగుతూ, ముఖ్యంగా కోరుట్ల నియోజకవర్గంలో ప్రజా సమస్య లపై పోరాడుతూ గుర్తింపు పొందారు. సామాజిక సేవా కార్యక్రమాలు, పార్టీ కార్యకలాపాల్లో ఆయన చురుకైన పాత్రను దృష్టిలో పెట్టుకొని అధిష్టానం ఆయనకు ఈ బాధ్యతలను అప్పగించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ నియామకం ద్వారా వెలమ సామాజిక వర్గానికి చెందిన సంక్షేమ పథకాల అమలు మరింత వేగవంతం అవుతుందని భావిస్తున్నారు. అలాగే రాష్ట్రంలో సామాజిక సమతుల్యతను పెంపొందించే దిశగా ఇది ముఖ్యమైన అడుగుగా రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఈ సందర్భంగా జువ్వాడి నర్సింగ రావు మాట్లాడుతూ..ప్రభుత్వం తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, వెలమ వర్గ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.