సప్త వాహనాలను తిలకించేందుకు తిరుమలకు తరలిన భక్తజనం
దాదాపు 3 లక్షల మంది భక్తులు తిరుమలకు రాక
టీటీడీ కల్పించిన సౌకర్యాలపై భక్తుల నుండి ప్రశంసల వెల్లువ
టీటీడీ చైర్మన్ బీ.ఆర్.నాయుడు
నవగీతం,తిరుపతి:
సూర్య జయంతిగా ప్రసిద్ధి చెందిన రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆదివారం తిరుమలలో మూడు లక్షల మందికి పైగా భక్తులు శ్రీవారి వాహన సేవలు తిలకించారని టీటీడీ చైర్మన్ బీ.ఆర్.నాయుడు తెలియజేశారు. రథ సప్తమి వేడుకల సందర్భంగా చైర్మన్ టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్తో కలిసి మాడ వీధుల్లోని గ్యాలరీలను పరిశీలించి, భక్తులతో మాట్లాడి అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ టీటీడీ అధికారులు, విజిలెన్స్ విభాగం, జిల్లా పోలీసుల సమన్వయంతో విస్తృత ఏర్పాట్లు చేయడంతో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వేడుకలను విజయవంతం చేసినట్లు చెప్పారు. అధికారులు, సిబ్బంది, పోలీసులు, జిల్లా యంత్రాంగం, శ్రీవారి సేవకులు, భక్తులందరికీ చైర్మన్ కృతజ్ఞతలు తెలిపారు.

కాగా భక్తులకు టీటీడీ సాంబార్ రైస్, టమాటా రైస్, పెరుగు అన్నం, సుండలు, బాదం మిల్క్ తదితర 14 రకాల అన్నప్రసాదాలను నిరంతరంగా అందించింది. ఇందుకోసం ప్రత్యేకంగా 2,000 మంది సేవకులను అన్నప్రసాద వితరణకు, 750 మందిని తాగునీటి సరఫరాకు, మరో 250 మందిని భక్తుల రద్దీ నియంత్రణకు నియమించారు. టీటీడీ బోర్డు చైర్మన్ బీఆర్ నాయుడు, టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ స్వయంగా భక్తులతో మాట్లాడి అభిప్రాయాలను తెలుసుకున్నారు. అన్నప్రసాదం, తాగునీరు, ఇతర సౌకర్యాల పట్ల భక్తులు పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారు.

రథ సప్తమి ముఖ్యాంశాలు
– మూడు లక్షల మందికిపైగా భక్తులు వాహన సేవలను తిలకించిన మూడు లక్షల మందికి పైగా భక్తులు
– గ్యాలరీల్లోని భక్తులకు 14 రకాల అన్నప్రసాదాలు పంపిణీ
– గ్యాలరీల్లో మొబైల్ వాటర్ డ్రమ్స్ తో నిరంతరం తాగునీటి సరఫరా
– మాడ వీధుల్లోని గ్యాలరీల్లో భక్తులకు ఎండకు, వర్షానికి ఇబ్బంది కలగకుండా పందిళ్లు ఏర్పాటు
– వర్షాన్ని కూడా లెక్కచేయకుండా వాహన సేవలను దర్శించిన భక్తులు
– సుమారు 2,500 మంది టీటీడీ విజిలెన్స్ సిబ్బంది, పోలీసులు మరియు 3,500 మంది శ్రీవారి సేవకులు భక్తులకు సేవలు
– 56 కళారూపాల్లో 1,000 మందికిపైగా కళాకారులు కళారూపాలు ప్రదర్శన
– భక్తుల కోసం నిరంతర మొబైల్ వైద్య సేవలు
– సెక్టోరల్ అధికారులు, డిప్యూటేషన్ సిబ్బంది 24 గంటల పాటు సౌకర్యాలను పర్యవేక్షణ
కాగా టీటీడీ అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి ఆదేశాల మేరకు, జేఈవో వీరబ్రహ్మం స్వయంగా సౌకర్యాల పర్యవేక్షణ చేపట్టారు. సీవీ & ఎస్వో మురళీకృష్ణ, జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు కలిసి రద్దీని నిరంతరం పర్యవేక్షిస్తూ, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టారు. ఎఫ్ఏ & సీఏఓ శ్రీ బాలాజీ, సీఈ సత్యనారాయణ, డిప్యూటీ సిఎఫ్ ఫణికుమార్ నాయుడు, అదనపు ఎఫ్ఏ&సిఏఓ రవిప్రసాద్, సీపీఆర్వో డాక్టర్ టి. రవి తదితర సీనియర్ అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షించారు.

