సిపిఐ జిల్లా కార్యదర్శి మంద సుదర్శన్
నవగీతం, ఇల్లంతకుంట:
ఇల్లంతకుంట మండలం లోని రేపాకలో కామ్రేడ్ రొండ్ల మాధవరెడ్డి స్తూపం నిర్మాణం కోసం సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో స్థలం పరిశీలించి, కరపత్రం ఆవిష్కరించారు.ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి మంద సుదర్శన్ మాట్లాడుతూ నైజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా జరిగిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో 1947 మార్చి 14 న హుస్నాబాద్ మండలం మహమ్మదాపూర్ గుట్టల్లో అమరులైన 12 మందలో 6 గురు మన ఇల్లంతకుంట మండల వాసులే కావడం మనందరికి ఎంతో గర్వ కారణం అని, అందులో కామ్రేడ్ రొండ్ల మాధవరెడ్డి జ్ఞాపకార్థం తన స్వ గ్రామం రేపాకలో బారీ స్థూపం నిర్మాణం చేయాలని సిపిఐ పార్టీ నిర్ణయించిందని అన్నారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం 14 ఏండ్ల మైనర్ బాలుడు అశ్వమిత్ గౌతమ్ కు,90 శాతం వికలాంగుడైన జి. యన్. సాయి బాబాలాంటి వికలాంగులకు, అమరవీరుల శవాలకు ,స్తూపాలకు ఎందుకు భయపడుతోందో ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు. ప్రశ్నించడమే నేరంగా పరిగణిస్తూ ప్రజలపై దారుణ మారణ కాండను కొనసాగిస్తున్న పాలకులు ఎంతో కాలం మనుగడ సాదించలేరని ఇలాంటి నియంతలు కాలగర్భంలో కలిసిపోకతప్పదని హెచ్చరించారు. బారత రాజ్యాంగాన్ని కాపాడుకోవడమే బారత ప్రజల ముందున్న తక్షణ కర్తవ్యం అని ఆయన అన్నారు. రేపాక లో భారీ ఎత్తున నిర్మించే అమరవీరుల స్థూపం కోసం అన్ని వర్గాల ప్రజలు తమ సంపూర్ణ సహయ సహకారాలు అందించి, ప్రజా పోరాటాల్లో భాగస్వాములు కావాలని అని అన్నారు.ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి తీపిరెడ్డి తిరుపతి రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు మంద అనిల్, కడారి రాములు, వండాపెల్లి లక్ష్మణ్, దళిత హక్కుల పోరాట సమితి నాయకురాలు పవిత్ర, రాజశేఖర్ రాజు, నరేష్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.

