పాల్గొన్న వివిధ జిల్లాల కలెక్టర్లు
నవగీతం,జగిత్యాల
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు సోమవారం హైదరాబాద్ నుంచి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణం పై రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్, పార్లమెంట్ సభ్యులు బలరాం నాయక్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ కృష్ణా రావు, టి.జి.ఈ.డబ్ల్యూ.ఐ.డి.సి. ఎండి గణపతి లతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లు, టి.జి.ఈ.డబ్ల్యూ. ఐ.డి.సి. అధికారుల కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.ఈ సమావేశానికి జగిత్యాల సమీకృత జిల్లా కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ ప్రభుత్వం గ్రామీణ ప్రాంత విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యను అందించి పోటీ ప్రపంచంలో నిలబడేలా తీర్చిదిద్దే ఉద్దేశంతో నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలను త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రస్తుతం కొనసాగుతున్న ఎస్సీ, ఎస్టీ, బిసి రెసిడెన్షియల్ పాఠశాలలలా కాకుండా అందరికీ ఒకే చోట ఉమ్మడి కుటుంబంలా సకల సౌకర్యాలతో పాఠశాలలను ప్రతిష్టాత్మకంగా నిర్మించడం జరుగుతుందని, రాష్ట్ర వ్యాప్తంగా 79 పాఠశాలలు మంజూరు కాగా 76 పాఠశాలలకు టెండర్లు పూర్తి కాబడి 18 పాఠశాలల్లో పనులు మొదలు పెట్టడం జరిగిందని తెలిపారు.జిల్లాల కలెక్టర్లు ప్రతి వారం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల నిర్మాణ పురోగతి పై సమీక్ష నిర్వహించాలని, ప్రతి నెలలో కనీసం ఒకసారి పాఠశాలల నిర్మాణాన్ని ప్రత్యక్షంగా తనిఖీ చేయాలని తెలిపారు. పాఠశాలలు నిర్మాణంలో ఉన్న చోట పని తీరు పురోగతి పై డాష్ బోర్డు ఏర్పాటు చేయాలని, తద్వారా ప్రభుత్వం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవడం సులభతరం అవుతుందని తెలిపారు. జిల్లా కలెక్టర్లు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణంపై ప్రత్యేక చొరవ తీసుకొని, 2027-28 విద్యా సంవత్సరం నాటికి రాష్ట్రంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ అంశం పై జిల్లా కలెక్టర్లు అలసత్వం ప్రదర్శించకూడదని, పూర్తి స్థాయి నాణ్యత ప్రమాణాలతో పాఠశాలలు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలలో విద్యతో పాటు క్రీడలు, సమాజంలో సవాళ్లను ఎదుర్కొనే విధంగా పర్సనాలిటీ డెవలప్మెంట్ తదితర అంశాలలో విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఈ సమావేశంలో జగిత్యాల, కోరుట్ల,మెట్పల్లి, మధుసూదన్, జివాకర్ రెడ్డి, శ్రీనివాస్ ఆర్డీవోలు, జెడ్పి సిఈవో గౌతమ్ రెడ్డి , జగిత్యాల మున్సిపల్ కమిషనర్ స్పందన, డి ఈ ఓ రామ్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

