తృటిలో తప్పిన పెను ప్రమాదం
నవగీతం,మల్లాపూర్ :
మల్లాపూర్ మండలం ఓబులాపూర్ ఎల్లమ్మ ఆలయం సమీపంలో మంగళవారం సాయంత్రం ఘోర ప్రమాదం తృటిలో తప్పింది. పాఠశాల నుండి విద్యార్థులను తీసుకొని వెళ్తున్న శ్రీ విజయ సాయి సెంట్రల్ హై స్కూల్ బస్సు ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయే ప్రయత్నంలో అదుపు తప్పి పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో కొత్త ధాంరాజ్ పల్లి గ్రామానికి చెందిన హనీష్ (2వ తరగతి విద్యార్థి) కి గాయాలు అయ్యాయి. వెంటనే స్థానికులు బాలుడిని అంబులెన్స్ ద్వారా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాలుడి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 36 మంది విద్యార్థులు ఉన్నారని సమాచారం. పెను ప్రమాదం తప్పడంతో తల్లిదండ్రులు, గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.


