27వ వార్డులో ఉనుకొండ సరస్వతి ముమ్మర ప్రచారం
నవగీతం, పెద్దపల్లి:
పెద్దపల్లి పట్టణాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపేందుకు ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అహర్నిశలు కృషి చేస్తున్నారని,ఆయన చేస్తున్న అభివృద్ధిని చూసి రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని 27వ వార్డు అభ్యర్థి ఉనుకొండ సరస్వతి-వైకుంటం కోరారు.శుక్రవారం వార్డులోని పలు వీధుల్లో ముమ్మర ప్రచారం నిర్వహించిన ఆమె, ఇంటింటికీ తిరిగి హస్తం గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు.ఈ సందర్భంగా ఉనుకొండ సరస్వతి-వైకుంటం మాట్లాడుతూ ఎమ్మెల్యే విజయరమణారావు పదవి చేపట్టిన నాటి నుండి పట్టణ ముఖచిత్రాన్ని మార్చేలా కోట్ల రూపాయలతో సీసీ రోడ్లు,డ్రైనేజీలు, సెంట్రల్ లైటింగ్ పనులను వేగవంతం చేశారని,ప్రతి వార్డుకు అభివృద్ధి ఫలాలు అందేలా ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నారని గుర్తు చేశారు.ఇదే ఉత్సాహంతో 27వ వార్డును కూడా అన్ని హంగులతో ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దే బాధ్యతను తాను భుజాన వేసుకుంటానని హామీ ఇచ్చారు.గత పాలకుల నిర్లక్ష్యం వల్ల పట్టణం ఎదుర్కొన్న సమస్యలను ఎమ్మెల్యే ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నారని తెలిపారు.ఫిబ్రవరి 11న జరిగే పోలింగ్లో చేతి గుర్తుకు ఓటు వేసి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని ఉనుకొండ సరస్వతి-వైకుంటం ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఈ ప్రచారంలో కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు, మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

