స్వయంగా మంచినీటిని సరఫరా చేస్తున్న వైస్ చైర్మన్ ఓంకారి నవీన్ కుమార్
నవగీతం జగిత్యాల ప్రతినిధి:
ఈ రోజుల్లో రాజకీయ నాయకుల హంగు, ఆర్భాటం ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఎన్నికల్లో గెలిచామో లేదో ఇక ‘నేనే రాజు నేనే మంత్రి’ అనుకునే ఈ కాలంలో… ఓ మున్సిపల్ కౌన్సిలర్ తనను నమ్మి ఓటేసి గెలిపించిన ప్రజలకు సేవ చేయడానికి అప్పుడే సిద్ధమయ్యారు. అయితే స్వయంగా మంచినీటి సరఫరాను చేపట్టి ఒకటో వార్డు ప్రజల మన్నలను అందుకుంటున్నారు ఆ వార్డు కౌన్సిలర్, మున్సిపల్ వైస్ చైర్మన్ ఓంకారి నవీన్ కుమార్. ఇక విషయంలోకి వస్తే… ప్రస్తుతం వేసవికాలం ప్రారంభం అవుతున్న నేపథ్యంలో వార్డు ప్రజలకు మంచినీటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు వాటర్ ట్యాంకర్ల ద్వారా మంచినీటి సరఫరాను ప్రారంభించారు. అయితే తానే స్వయంగా ఇంటింటికి వెళ్లి మంచినీటిని సరఫరా చేయడం పలువురిని అబ్బురపరిచింది. ఎవరైనా కౌన్సిలర్ గా గెలిస్తే చేసే హంగు ఆర్భాటం అంతా ఇంత కాదు కదా. అయితే పట్టణంలోని ఒకటో వార్డు కౌన్సిలర్, మున్సిపల్ వైస్ చైర్మన్ హోదాలో ఉండి కూడా ఓంకారి నవీన్ కుమార్ తన వార్డు ప్రజలకు మంచినీటిని సరఫరా చేయడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ వైస్ చైర్మన్ ఓంకారి నవీన్ కుమార్ మాట్లాడుతూ వార్డు ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉంటానని, ఎలాంటి సమస్యలు ఉన్న పరిష్కరించడానికి కృషి చేస్తానని పేర్కొన్నారు.

