Thursday, February 26, 2026
ads
Homeజిల్లా వార్తలుజగిత్యాలమున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ పదవుల ఎంపికకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి

మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ పదవుల ఎంపికకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి

📰 Generate e-Paper Clip

– రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని

నవగీతం,జగిత్యాల ప్రతినిధి:

ఎన్నికల మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్‌ల ఎంపిక ప్రక్రియను పూర్తిగా పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించారు. సోమవారం హైదరాబాద్ నుండి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలు, మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎంపికలో ఎక్స్ ఆఫీషియో సభ్యుల ఓటు హక్కు వినియోగం తదితర అంశాలపై రాష్ట్రంలోని అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జగిత్యాల కలెక్టరేట్ నుండి జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్, జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థల) బి. రాజ గౌడ్ తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ జారీ చేసిన మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని, ఎక్కడ చిన్నపాటి లోపాలకు కూడా అవకాశం లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల సందర్భంగా శాంతి భద్రతలకు భంగం కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, అవసరమైన చోట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని తెలిపారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ పూర్తిగా అమలులో ఉండాలని, నిబంధనల ఉల్లంఘనలకు తావు లేకుండా అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని ఆదేశించారు.

ఎంపిక ప్రక్రియలో భాగంగా కౌన్సిలర్లకు, ఎక్స్ ఆఫీషియో సభ్యులకు ముందుగానే సమాచారం అందించాలని, పోలింగ్, లెక్కింపు, ఫలితాల ప్రకటన వరకు ప్రతి దశను క్షుణ్ణంగా పర్యవేక్షించాలని అన్ని జిల్లాల ఎన్నికల అధికారులకు సూచించారు. పరోక్ష విధానం ద్వారా మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక సమయంలో పార్లమెంట్ సభ్యులు, శాసన సభ్యులు, ఎమ్మెల్సీలు, రాజ్య సభ సభ్యులు ఎక్స్ అఫిషియో హోదాలో ఏదో ఒక మున్సిపాలిటీని ఎంచుకొని ఆప్షన్ ఇచ్చుకోవాల్సి ఉంటుందని తెలిపారు. సెక్షన్ 5, 20 ప్రకారం ఎవరైనా ప్రజా ప్రతినిధులు, ఎమ్మెల్సీలు తాము ఎన్నికైన 30 రోజుల్లోపు ఏదో ఒక మున్సిపాలిటీకి ప్రాతినిధ్యం వహించేందుకు ఆప్షన్ ఇచ్చి ఉండాలని, అలా కాకుండా ఇంతవరకు ఆప్షన్ ఇవ్వని పక్షంలో నిబంధన ప్రకారం మున్సిపల్ ఎన్నికలు అయిన 30 రోజుల్లో ఆప్షన్ ను సంబంధిత మున్సిపల్ కమిషనర్ కు ఇవ్వాల్సి ఉంటుందన్నారు. దీనికొరకు ఫిబ్రవరి, 11 నుండి 14వ తేదీ లోపు నోటీస్ జారి చేసి ప్రజాప్రతినిధుల నుండి ఆప్షన్ తీసుకోవాలని సూచించారు. జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ మాట్లాడుతూ జిల్లాలోని 5 మున్సిపాలిటీలకు సంబంధించి రెండవ సాధారణ మున్సిపల్ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకారం తగు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పోలింగ్, కౌంటింగ్, మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక సమయాల్లో ఎన్నికల నిబంధనల మేరకు అన్ని రకాల చర్యలు తీసుకుంటామని అందుకు అన్నిరకాల ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. జిల్లాకు సంబంధించిన ప్రజాప్రతినిధులకు ఎన్నికల నిబంధనల మేరకు ఫిబ్రవరి, 11 నుండి 14వ తేదీ లోపు నోటీసులు జారీ చేసి ఆప్షన్ తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా పూర్తయ్యేల అన్ని రకాల ఏర్పాట్లు చేస్తామని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular