నవగీతం,కొడిమ్యాల :
కొడిమ్యాల మండలం రామకిష్టాపూర్ గ్రామంలో శనివారం రైతులు పంట మార్పిడి విధానం పాటించడంతో పాటు సంప్రదాయ ఎరువులను వినియోగించి పర్యావరణాన్ని సంరక్షించాలని సూచిస్తూ రైతు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ , కరీంనగర్కు చెందిన వ్యవసాయ కళాశాల విద్యార్థులు గ్రామీణ వ్యవసాయ అనుభవ కార్యక్రమంలో భాగంగా పీఆర్ఏ (పార్టిసిపేటరీ రూరల్ అప్రైసల్ ) కార్యక్రమాన్ని చేపట్టారు.ఈ సందర్భంగా సామాజిక పటం, వనరుల పటం, సమస్యల చెట్టు, సంపద ర్యాంకింగ్, గ్రామ జనాభా పటం వంటి పద్ధతుల ద్వారా గ్రామ పరిస్థితులను విశ్లేషించి రైతులకు పంటల వైవిధ్యీకరణ, మట్టి సంరక్షణ, సేంద్రియ ఎరువుల వినియోగం వంటి అంశాలపై అవగాహన కల్పించారు.కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నేరెల మహేష్, కేర్టేకర్ బాపురెడ్డి, రాఘవరెడ్డి, రైతులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. కళాశాల విద్యార్థినులు కె. రక్షిత, ఎం. నందిని, ఎం. భవాని, పూజిత, వైష్ణవి తదితరులు కార్యక్రమంలో చురుకుగా పాల్గొని రైతులతో ప్రత్యక్షంగా చర్చించారు.ఇటువంటి కార్యక్రమాలు రైతులకు శాస్త్రీయ పద్ధతులపై అవగాహన పెంచి, స్థిరమైన వ్యవసాయానికి దోహదపడతాయని నిర్వాహకులు తెలిపారు.

