నవగీతం, జగిత్యాల ప్రతినిధి:
జగిత్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు ఆంజనేయస్వామి దేవస్థానం ఆలయ ఈవోగా రమాదేవి బుధవారం బాధ్యతలు స్వీకరించారు.బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆమె ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, అర్చకులతో సమావేశమై పలు కీలక సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు రమాదేవికి ఘన స్వాగతం పలికారు. దర్శనం అనంతరం ఆమెకు తీర్థప్రసాదాలు అందజేశారు.ఈ సందర్భంగా ఈవో రమాదేవి మాట్లాడుతూ, వీఐపీ భక్తులైనా, సాధారణ భక్తులైనా అందరికీ సమానంగా దర్శనం కల్పించేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సేవలను మెరుగుపరచాలని ఆదేశించారు. గత ఈవో తీసుకున్న నిర్ణయాలు యథావిధిగా కొనసాగుతాయని తెలిపారు.

విధుల్లో నిర్లక్ష్యం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మూడు రోజుల క్రితం వేములవాడ రాజరాజేశ్వరస్వామి దేవస్థానం ఈవోగా పనిచేసిన రమాదేవి, ప్రస్తుతం కొండగట్టు ఆలయానికి ఫుల్ ఛార్జ్ ఈవోగా నియమితులయ్యారు. బుధవారం కొండగట్టుకు చేరుకుని అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు.

