నవగీతం, జగిత్యాల ప్రతినిధి:
కేంద్ర యువజన, క్రీడల వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు, జిల్లా కలెక్టర్ అనుమతితో ఖేలో ఇండియా కార్యక్రమంలో భాగంగా నారీశక్తి అస్మిత క్రీడా పోటీలను జగిత్యాల జిల్లాలో నిర్వహించారు. జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి డాక్టర్ కోరుకంటి రవికుమార్ ఆధ్వర్యంలో ఈ పోటీలు గురువారం ఘనంగా జరిగాయి.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ ఎం. సంజయ్ కుమార్ హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా 14 నుండి 17 సంవత్సరాల వయస్సు గల బాలికల కోసం కబడ్డీ, బాక్సింగ్, అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించారు. పోటీల్లో ప్రతిభ కనబరిచి గెలుపొందిన క్రీడాకారిణులకు బహుమతులను ప్రదానం చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ ఎం. సంజయ్ కుమార్ మాట్లాడుతూ మహిళలు నేడు అన్ని రంగాలలోనే కాకుండా క్రీడలలో కూడా విశేష ప్రతిభ కనబరుస్తున్నారని అన్నారు. రాబోయే కాలంలో మహిళలకు క్రీడల రంగంలో మంచి భవిష్యత్తు ఉందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బీఎస్ లత, 22వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ ఆరు లక్ష్మి, జిల్లా విద్యాధికారి రాము, జిల్లా అథ్లెటిక్ అసోసియేషన్ కార్యదర్శి ముత్యం రెడ్డి, పేట అధ్యక్షులు పడాల విశ్వప్రసాద్, పీడీలు, పలువురు క్రీడాకారులు పాల్గొన్నారు.

