Monday, March 9, 2026
ads
Homeతెలంగాణహైదరాబాద్సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం

సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం

📰 Generate e-Paper Clip

సాహితీ వేత్తల సమ్మేళనం

నవగీతం, హైదరాబాద్:

తెలంగాణ సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో ఆదివారం రవీంద్ర భారతి కాన్ఫరెన్స్ హాలులో ‘అంతర్జాతీయ మహిళా దినోత్సవం’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి సభాధ్యక్షత వహించిన అకాడమీ కార్యదర్శి నామోజు బాలాచారి మాట్లాడుతూ ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని అకాడమీ తరఫున నిర్వహిస్తున్నామన్నారు.

ఈ సంవత్సరము సభను ‘థీమ్’ ప్రకారంగా మూడు సదస్సులుగా విభజించి నిర్వహిస్తున్నామన్నారు. మొదటి సదస్సు “స్త్రీవాద సాహిత్యం దశ – దిశ” రెండవది ‘ఆధునిక యుగంలో స్త్రీల సాధికారత’ మూడవ సదస్సు ‘డిజిటల్ యుగంలో స్త్రీలు ఎదుర్కొంటున్న సవాళ్లు’ ఇలా మూడు సదస్సులు ఏర్పాటు చేసి, రాష్ట్రంలోని వివిధ రంగాలకు చెందిన ప్రముఖ మహిళలను ఆహ్వానించి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నామని తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి అన్నారు. మొదటి సదస్సులో పాల్గొన్న జూపాక సుభద్ర మాట్లాడుతూ మహిళలు సాధికారికంగా స్వేచ్ఛగా ఉండాలి. భారతదేశంలో కొందరు మహిళలు అంటరాని కులం లాంటి ప్రాతిపదికనే మహిళా ఉనికి కొనసాగుతుంది. పెద్దపెద్ద కంపెనీలలో ఇప్పటికి ఉన్నత స్థానంలో ఇలాంటి మహిళల సంఖ్య చాలా తక్కువగా ఉంది ఆ సంఖ్య పెరగాలని తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఆచార్య త్రివేణి మాట్లాడుతూ సమాజంలో స్త్రీలే సృష్టికి మూలం అన్న విషయాన్ని సమాజం మర్చిపోదు. ప్రస్తుతం సమాజంలో గృహింస వరకట్నాలు భ్రూణ హత్యలు లాంటి అనేక అంశాల నుండి స్త్రీలు బయటపడినప్పుడే సాధికారత సాధించినట్లు అవుతుందన్నారు.

మరొక అతిథి షేఖ్ హసీనా మాట్లాడుతూ మాతృస్వాతంత్రం నుండి పితృస్వాతంత్ర వ్యవస్థ వచ్చింది. ఇందుకు కందుకూరి, రాజారామ్ మోహన్ రావు లాంటి మహనీయులు చేసిన కృషిని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలన్నారు. మరో కవయిత్రి శిలాలోలిత మాట్లాడుతూ మహిళా సాధికారత ఇంకా సాధించాల్సి ఉంది అన్నారు.దేవనపల్లి వీణావాణి మాట్లాడుతూ భారత స్వాతంత్ర్య అనంతరం స్త్రీల విద్య కోసం కృషి చేసిన వారు ఎందరో ఉన్నారు. అట్టి వాళ్లలో స్త్రీల విద్యకోసమై కృషి చేర్చినవారిలో పురుషులే ముందున్నారని అన్నారు. సామాజిక రాజకీయ ఆర్థిక రంగాలలో మహిళను ముందుకు తీసుకెళ్లాలని, అందులో వారికి రాజకీయ, ఆర్థిక రంగాలలో తగిన భాగస్వామ్యాన్ని పెంచే దిశగా మహిళలు ముందుకు రావాలని అభిప్రాయపడ్డారు. ప్రముఖ అనువాదకురాలు స్వాతి శ్రీపాద మాట్లాడుతూ విలువైన వస్తువులను ఇంట్లో జాగ్రత్తగా భద్రపరచుకున్నట్లే స్త్రీమూర్తులను కూడా సమాజం భద్రంగా చూసుకున్నప్పుడే స్త్రీల ఆత్మవిశ్వాసము పెంచిన వాళ్ళవుతారని, వారికి స్వేచ్ఛ ఇచ్చినట్లు అవుతుందని అన్నారు.

మరోక కవయిత్రి గోగు శ్యామల మాట్లాడుతూ వందల సంవత్సరాలుగా ఎందరో మహనీయులు స్త్రీవాదాన్ని అనేక కోణాలలో ఆవిష్కరించారు. భారతదేశంలో స్త్రీలకు అనేక హక్కులను కల్పించారు. దీనితోపాటు దేశంలో అమ్మ అనే పాత్రకు గొప్ప స్థానం ఉంది. అంటూ అమ్మల యొక్క గొప్పతనాన్ని విశ్లేషించారు. కవయిత్రి శాంతి ప్రబోధ మాట్లాడుతూ అచ్చమాంబ కాలం నుండి స్త్రీ వాద సాహిత్యం ఉందన్నారు. గత కొంతకాలంగా ఈ సాహిత్యంలో మార్పు వచ్చిందన్నారు. రాజకీయ, ఆర్థిక, అస్తిత్వం కోసం, హక్కుల కోసం స్త్రీ సమస్యలపై పోరాటం జరిగిన విషయాలను తెలియజేశారు. బయటి ప్రపంచంలో గుర్తింపు కలిగిన ఎందరో మహిళలకు ఇంటి లోపల గుర్తింపు లేకపోవడం విచారమంటూ తన ఆవేదనను వ్యక్తం చేశారు. రెండో సదస్సుగా జరిగిన ‘ఆధునిక యుగంలో స్త్రీల సాధికారత’ అంశంపై సమన్వయకర్తగా కాళోజీ అవార్డు గ్రహీత శ్రీమతి నెల్లుట్ల రమాదేవి గారు పాల్గొన్నారు.

ఈ అంశంపై వివిధ రంగాలకు చెందిన మహిళలు వారు సాధికారంగా సాధించిన అనేక విషయాలపై, సమాజ నిర్మాణంలో స్త్రీలకు సమాన అవకాశాలు కలిగి ఉండే మహిళా హక్కులపై, మహిళ విద్యా వ్యవస్థ పై చర్చ జరిగింది. ఈ సదస్సులో అనేక మంది మహిళలు పాల్గొని తమ తమ అభిప్రాయాలను వెల్లడించారు. చివరి సదస్సుగా కవయిత్రి ఉషారాణి అధ్యక్షతన ‘డిజిటల్ యుగంలో స్త్రీలు ఎదుర్కొంటున్న సవాళ్లు’ అనే అంశంపై ఈ సదస్సు జరిగింది. సదస్సుల అనంతరం నూతనంగా కవిత్వం రాస్తున్న నేటి వర్తమాన కవయిత్రులు, విద్యార్థినిలను ఆహ్వానించి వారితో కవి సమ్మేళనం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సగిలి సుధారాణి, సమ్మెట విజయ, అరుణ కీర్తి పతాక, సంధ్యా విప్లవ్, బండారు విజయ, పల్లా మాలతి, రంగరాజు పద్మజ, నస్త్రీన్ ఖాన్, జ్వలిత, సమ్మెట ఉమాదేవి, సీతాలక్ష్మి, సరిత సలీమాతో పాటు అనేకమంది వర్ధమాన కవయిత్రులు, తదితర సాహితీవేత్తలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళలందరికీ సాహిత్య అకాడమీ కార్యదర్శి నామోజు బాలాచారి అకాడమీ తరఫున మెమొంటో, శాల్వతో ఘనంగా సత్కరించారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular