వైభవంగా స్వర్ణ రథోత్సవము
గజవాహనంపై భక్తులకు కటాక్షించిన శ్రీవారు
నవగీతం, హైదరాబాద్:
జూబ్లీహిల్స్ శ్రీ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజైన ఆదివారం ఉదయం శ్రీనివాసుడు శ్రీ కోదండ రాముడి అలంకారంలో హనుమంత వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం 8 నుండి 9 గంటల వరకు స్వామివారు నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.

వాహనసేవ ముందు మంగళవాయిద్యాల నడుమ, భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, స్వామివారి ఉత్సవం కోలాహలంగా జరిగింది. శ్రీవారు త్రేతాయుగంలో శ్రీరాముడై అవతరించారు. హనుమంత వాహనం భగవత్ భక్తి ప్రాప్తి. బ్రహ్మోత్సవాలలో ఆరో రోజు ఉదయం స్వామివారు కోదండ వేంకటరాముడై హనుమంతునిపై ఆసీనుడై భక్తులను అనుగ్రహించారు. ఈ ఉత్సవంలో వాహనంగా హనుమంతుడిని, వాహనాన్ని అధిష్టించిన జూబ్లీహిల్స్ శ్రీ వేంకటరాముడిని దర్శించడం వల్ల భోగమోక్షాలు, జ్ఞానవిజ్ఞానాలు, అభయారోగ్యాలు కలుగుతాయి. మధ్యాహ్నం శ్రీవారి కల్యాణమండపంలో వసంతోత్సవం ఘనంగా నిర్వహించరు.

సాయంత్రం వైభవంగా స్వర్ణ రథోత్సవము జరిగింది. స్వామివారు రాత్రి 7 నుండి గజవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారని టీటీడీ జూబ్లీహిల్స్ శ్రీ వేంకటేశ్వర టెంపుల్ లోకల్ అడ్వైసరీ కమిటీ ప్రెసిడెంట్ ఏ వేంకటేశ్వరా రెడ్డి,హైదరాబాద్ టీటీడీఎఈఓ యూ రమేష్ తెలిపారు.ఈ వాహనసేవలో టీటీడీ జూబ్లీహిల్స్ శ్రీ వేంకటేశ్వర టెంపుల్ లోకల్ అడ్వైసరీ కమిటీ ప్రెసిడెంట్ ఏ వేంకటేశ్వరా రెడ్డి,హైదరాబాద్ టీటీడీ ఎఈఓ యూ రమేష్, ఆలయ అర్చకులు, టెంపుల్ ఇన్పెక్టర్స్ నిరంజన్, హరికృష్ణ, మాజీ లోకల్ అడ్వైసరీ కమిటీ మెంబర్ బివి రమణారెడ్డి, పలువురు అధికారులు, అధికసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

