ఐదేళ్ల ఆత్మగౌరవాన్ని డబ్బుకు అమ్మకండి
నవగీతం,పెద్దపల్లి:
సుల్తానాబాద్ 6వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి మహమ్మద్ యూసుఫ్ అలీ ఎన్నికల ప్రచారంలో ఒక విప్లవాత్మక మార్పుకు శ్రీకారం చుట్టారు. రాజకీయం అంటే వ్యాపారం కాదని,అది ఒక బాధ్యత అని చాటిచెబుతూ ఎన్నికల వేళ మద్యం,డబ్బు పంపిణీకి తాను పూర్తిగా వ్యతిరేకమని ఆయన ప్రకటించారు. ప్రచార ఆర్భాటాలకు, ఓటర్లను ప్రలోభపెట్టడానికి ఖర్చు చేసే సుమారు 15 నుండి 20 లక్షల రూపాయలను వృధా చేయకుండా,ఆ సొమ్మును నేరుగా వార్డు ప్రజల సంక్షేమం కోసమే వాడాలనే సంకల్పంతో ఆయన కుటుంబానికి అండ అనే వినూత్న పథకాన్ని ప్రకటించారు.ఈ పథకం ద్వారా ఆడబిడ్డ పెళ్లికి రూ.20వేలు,అబ్బాయి పెళ్లికి రూ.10వేలు మరియు కుటుంబంలో ఎవరైనా మరణిస్తే అంత్యక్రియల కోసం తక్షణ సాయంగా రూ.5వేలు అందజేస్తానని యూసుఫ్ అలీ హామీ ఇచ్చారు.కేవలం రెండు రోజుల్లో కరిగిపోయే చిల్లర డబ్బులకు,మద్యం సీసాలకు ఆశపడి ఐదేళ్ల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టవద్దని,ప్రశ్నించే హక్కును కాపాడుకోవాలని ఆయన ఓటర్లను కోరుతున్నారు.వ్యవస్థను బ్రష్టు పట్టించిన ఈ ధన రాజకీయాన్ని మార్చడమే తన లక్ష్యమని స్పష్టం చేస్తూ,కష్టంలో తోడుండే నాయకత్వాన్ని ఎంచుకోవాలని ఆయన పిలుపునివ్వడం ఇప్పుడు స్థానికంగా పెద్ద చర్చకు దారితీసింది.

