నవగీతం, జగిత్యాల,ప్రతినిధి:
పవిత్ర రంజాన్ ఉపవాస దీక్ష సందర్భంగా ముస్లిం సోదరుల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు ఆత్మీయతకు, మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తుందని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల పట్టణంలోని ఖిలగడ్డ కమ్యూనిటీ హాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ పాల్గొన్నారు. ఉపవాస దీక్షలో ఉన్న ముస్లిం సోదరులకు ఖర్జూరం, ఫలహారాలు తినిపించి దీక్షను విరమింప చేశారు. అనంతరం ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రంజాన్ పర్వదినం ప్రేమ, సోదరభావం, సహనానికి ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు. అన్ని మతాల ప్రజలు పరస్పర గౌరవంతో, సౌహార్దంతో కలిసి జీవించడం సమాజానికి ఎంతో అవసరమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీ సంక్షేమానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ సమిండ్ల వాణి శ్రీనివాస్, వైస్ చైర్మన్ జీనత్ పర్వీన్ మున్నా, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గాజంగి నందయ్య, ఎంఆర్ఓ రామ్మోహన్, మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం, మాజీ వైస్ చైర్మన్ మన్సూర్, ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు లియాఖత్ అలీ మోసిన్, నాయకులు అడువల లక్ష్మణ్, కౌన్సిలర్లు, పట్టణ నాయకులు, మైనార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.


