బీసీ జేఏసీ జిల్లా చైర్మన్ దాసరి ఉష
నవగీతం,పెద్దపల్లి ప్రతినిధి:
పెద్దపల్లి పట్టణంలోని ఎంబీ గార్డెన్ వేదికగా బుధవారం సాయంత్రం మైనార్టీ యూత్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు అత్యంత వైభవంగా జరిగింది.ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి పెద్దపల్లి జిల్లా బీసీ జేఏసీ చైర్మన్ శ్రీమతి దాసరి ఉష ముఖ్య అతిథిగా హాజరై,ముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. సాయంత్రం వేళ ప్రార్థనల అనంతరం ముస్లిం సోదరులు ఉపవాస దీక్షలను విరమించగా,వారికి ఆమె స్వయంగా పండ్లను, పానీయాలను వడ్డించి అభినందనలు తెలిపారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో దాసరి ఉష ప్రసంగిస్తూ పవిత్ర రంజాన్ మాసం కేవలం ఉపవాస దీక్షలకే పరిమితం కాదని,ఇది మానవత్వానికి, క్రమశిక్షణకు మరియు తోటివారికి సహాయం చేసే దానగుణానికి ప్రతీక అని కొనియాడారు. కులమతాలకు అతీతంగా అందరూ కలిసి మెలిసి పండుగలు జరుపుకోవడం మన భారతీయ సంస్కృతిలోని గొప్పతనమని,ఈ ఇఫ్తార్ విందు గంగా-జమునా తెహజీబ్ ను ప్రతిబింబిస్తోందని ఆమె పేర్కొన్నారు. మైనార్టీ యువత సమాజ సేవలో ముందుండాలని,ఇలాంటి కార్యక్రమాల ద్వారా ఐక్యతను చాటడం అభినందనీయమని ఆమె యువతను ఉత్సాహపరిచారు.ముస్లిం సోదరులందరికీ రంజాన్ ముందస్తు శుభాకాంక్షలు తెలియజేస్తూ,అల్లాహ్ ఆశీస్సులతో జిల్లా ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆమె ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో మైనార్టీ యూత్ ప్రతినిధులు ఎండి మొహిద్,సయ్యద్ మసీద్ మాలిక్,బీసీ జేఏసీ వర్కింగ్ ప్రెసిడెంట్ నల్లవెల్లి శంకర్,బీసీ జేఏసీ ఇంటలెక్చువల్ ఫోరం ప్రతినిధి అలువాల రాజేందర్, బీసీ జేఏసీ యాదవ సంఘం జిల్లా కన్వీనర్ సలేంద్ర కొమురయ్య,సిపిఐ జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం,బొల్లం భూమేష్, కూకట్ల నవీన్ కుమార్, శ్రావణ్, భూమయ్య,వివిధ సంఘాల నాయకులు,పట్టణ ప్రముఖులు, ముస్లిం సోదరులు పాల్గొన్నారు.


