నవగీతం,మల్లాపూర్ ప్రతినిధి:
మల్లాపూర్ మండలంలోని వేంపల్లి గ్రామ పరిధిలో మంగళవారం జరిగిన అగ్ని ప్రమాదంలో రైతు పండించిన మొక్కజొన్న పంట పూర్తిగా దగ్ధమైంది. సుమారు 1.5 ఎకరాల్లో సాగు చేసిన పంట క్షణాల్లో మంటల్లో చిక్కుకుని బూడిదైంది. మంటలు చెలరేగిన వెంటనే రైతులు, స్థానికులు కలిసి వాటిని అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నించిన ప్పటికీ, అప్పటికే భారీ నష్టం వాటిల్లింది. కోతకోసి అమ్మకానికి ఉన్న పంట కళ్లముందే కాలిపోవడంతో బాధిత రైతు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ కన్నీరు మున్నీరుగా విలపించాడు. ఈ అగ్ని ప్రమాదంతో సుమారు రూ.1.50 లక్షల వరకు ఆర్థిక నష్టం సంభవించినట్లు రైతు ఆవేదన వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న రెవెన్యూ ఇన్స్పెక్టర్ అశోక్ సంఘటన స్థలాన్ని సందర్శించి పంట నష్టాన్ని పరిశీలించారు. బాధిత రైతుకు ప్రభుత్వం తక్షణ నష్టపరిహారం అందించాలని గ్రామస్థులు కోరుతున్నారు.

